Tuesday, March 19, 2024
HomeTrending Newsస్వచ్ఛమైన పాలతోనే ఆరోగ్యం: సిఎం జగన్

స్వచ్ఛమైన పాలతోనే ఆరోగ్యం: సిఎం జగన్

స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలని, ఆర్గానిక్‌ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని,  ఈ విషయంలో సమగ్ర పద్ధతుల్లో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆవులు, గేదెలు తీసుకునే ఆహారంలో ఫెస్టిసైడ్స్, రసాయనాలు ఎక్కువగా వాడుతున్నందున పాలల్లో  కూడా వాటి అవశేషాలు ఉంటున్నాయని  ఇవి అనారోగ్యాలకు దారి తీస్తున్నాయని అయన అభిప్రాయపడ్డారు. క్యాంపు కార్యాలయంలో పశుసంవర్థక శాఖపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. పశువుల ఆస్పత్రుల్లో నాడు– నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలో పశువులకు వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ…

  • అమూల్‌ ద్వారా రైతులకు అవగాహన కల్పించాలి
  • తక్కువ పెట్టుబడి, సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించే అంశంపై పరిశోధనల ఫలితాలు రైతులకు చెప్పాలి
  • అమూల్‌ద్వారా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆలోచన చేయాలి
  • పాలు, గుడ్లు వాడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, వాటిని వినియోగిస్తాం
  • కానీ అవే పాలలో రసాయనాల అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితులు చూస్తున్నాం
  • ఆరోగ్యవంతమైన పిల్లలు ద్వారానే మంచి భవిష్యత్తు తరాలు నిర్మాణం అవుతాయి
  • పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులపై రైతులకు అవగాహన నిరంతరం కల్పించాలి
  • పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీని పూర్తిచేయాలి
  • ప్రతి ఆర్బీకేలో కూడా ఈ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలి
  • వైయస్సార్‌ చేయూత, ఆసరా ద్వారా పశువులను కొనుగోలు చేశారు, ఆ పశువులన్నింటికీ కూడా బీమా ఉందా?లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి
  • 80శాతం ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుంది
  • పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో కూడా రైతులకు అవగాహన కల్పించాలి
  • సాయిల్‌డాక్టర్‌ మాదిరిగా కేటిల్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా అమలు చేయాలి
  • ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా పశువుల ఆరోగ్యాలను పరిశీలించి, పరీక్షించి వాటి వివరాలను పశు ఆరోగ్య కార్డుల్లో అప్‌గ్రేడ్‌ చేయాలి
  • వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద పనులు చేపట్టాలి
  • ఆ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి
  • మండలం ఒక యూనిట్‌గా తీసుకుని ప్రతిచోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక అమలు చేయాలి

వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు,  ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలు, గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతం, లంపీ వైరస్‌పై ముందు జాగ్రత్త చర్యలు లాంటి అంశాలపై కూడా సిఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సమీక్షా సమావేశానికి పశు సంవర్ధక, పాడి అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పశు సంవర్ధక శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ ఆర్‌. అమరేంద్ర కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : సిఎం జగన్ కు జమ్ జమ్ వాటర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్