Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

విభజన హామీలు వెంటనే అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేయాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.  విభజన జరిగి 9 సంవత్సరాలు పూర్తయినా అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలు చాలా వరకూ పరిష్కారానికి నోచుకోలేదని,  వీటిపై వెంటనే దృష్టిసారించాలని ప్రధానిని కోరారు.  పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోడీతో సిఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞాపన పత్రం అందించారు.

ప్రధానితో సిఎం ప్రస్తావించిన అంశాలు :

  • ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించింది.  కానీ కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయి
  • 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలి
  • రుణపరిమితి ఈ విషయంలో జోక్యంచేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలి
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాను సొంతంగా సొంత ఖజానానుంచి రూ. 2,600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలి
  • పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదం తెలపాలి. తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూసో. కాంపొనెంట్‌ వారీగా నిబంధనలను సడలించాలి
  • పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలి
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను.
  • తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాలి
  • జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇస్తోంది. దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం వినియోగించని రేషన్‌ కోటాను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరుతున్నాను.
  • రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
  • రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతిజిల్లాకు సుమారుగా 18లక్షలమంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్‌ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాను.
  • వైయస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజనచట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్‌ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీ ఎండీసీకి గనులు కేటాయించాలి

అంటూ ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com