మొక్కలంటే చాలామందికి ప్రాణం. రకరకాల కుండీల్లో, నేలపైన పెంచి మురిసిపోతూ ఉంటారు. కొంతమంది పెరటితోటలు, మరికొందరు పూలమొక్కలు తమ ఇళ్లల్లో పెంచుతూ ఉంటారు. మొక్కలు, ఖరీదైన కుండీలు అపురూపంగా చూసుకుంటారు. వీరి కృషి ఇంటివరకే పరిమితం. కానీ ఒరిస్సాకి చెందిన దీనబంధు అలా అనుకోలేదు. తనచుట్టూ ఉన్న ప్రపంచాన్నీ పచ్చగా చేయాలనుకున్నాడు. అందుకు తన పరిధి లోనే వినూత్న మార్గం ఎంచుకున్నాడు.
ఎప్పుడన్నా అనుకోకుండా మనవల్ల చిన్న మంచిపని జరిగితే, దానిని ఎవరన్నా గుర్తించి మెచ్చుకుంటే పొంగిపోతాం. ఎప్పుడూ అలాగే చేస్తామనేంత బిల్డప్ ఇస్తాం. అనుకోకుండా వచ్చిన పేరు, గుర్తింపు ప్రచారం కూడా చేస్తాం. మరి నిజంగానే ఎప్పుడూ మంచిపనులు చేసే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళుకూడా తమ గురించి ప్రచారం కోరుకుంటారా అంటే ఒరిస్సా వెళ్లి దీనబంధు బెహరాను కలవాలి. జటిని పట్టణానికి చెందిన ఈ టీ అమ్మకందారుడు 20 ఏళ్లుగా పర్యావరణం కోసం పాటుపడుతున్నాడు. ఎలాగంటారా? ఎవరన్నా మొక్కలు ఇస్తే బదులుగా వారికి టీ ఇస్తాడు. పైగా తన ఆశయం కోసం స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వ పథకాల సాయం కోరలేదు.

టీ ఇచ్చి బదులుగా డబ్బులు కాకుండా మొక్కలు కోరడం ద్వారా వందలాది చెట్లు పెంచాడు దీనబంధు. అతని చిన్న టీ దుకాణం పచ్చదనంతో పరిమళిస్తూ పర్యావరణం పట్ల అతని అంకిత భావానికి, ఆకుపచ్చని మార్పునకు సంకేతంగా నిలుస్తోంది.
దేహమేరా దేవాలయం అన్నారో కవిగారు. కానీ ఒక మొక్క పెంచితే ఏడు దేవాలయాలు కట్టినంత పుణ్యం అంటున్న దీనబంధు వ్యక్తిత్వం అపురూపం.
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

