Wednesday, June 17, 2026
HomeTrending Newsహైదరాబాద్ రోడ్లపైకి మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్ రోడ్లపైకి మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్ నగరంలో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు పరుగు తీయనున్నాయి. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి కే. తారక రామారావుతోపాటు చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఫార్ములా ఇ-ప్రిక్స్‌ నేపథ్యంలో ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ స్ట్రెచ్‌లను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరుగుతాయి. ఫిబ్రవరి 11 తర్వాత పర్యాటక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ బస్సులను హెరిటేజ్ సర్క్యూట్‌లో ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. నిజాం హయాంలో మొదలైన సాంప్రదాయ డబుల్ డెక్కర్ బస్సులు 2003 వరకు నగరంలో తిరిగాయి. ట్విట్టర్‌లో ఒక పౌరుడి అభ్యర్థన మేరకు, ఆ బస్సులలో ప్రయాణించిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కేటీఆర్, డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావడానికి గల అవకాశాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి సూచనల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. అందులో మూడు బస్సులను డెలివరీ చేసి ఈ రోజు ప్రారంభించారు. మిగిలిన మూడు బస్సులు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. 20 బస్సులకు విస్తరించాలని hmda యోచిస్తోంది. ఒక్కో బస్సు ధర 2 కోట్ల16 లక్షల రూపాయలు. ఏడు సంవత్సరాల పాటు AMC కొనసాగుతుంది. బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉంది. ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్‌ బ్యాటరీలతో నడుస్తాయి. ఒకే ఛార్జ్‌లో 150 కిమీల దూరం ప్రయాణిస్తాయి. రెండు నుంచి రెండున్నర గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular