కజికిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబకినా వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా అవతరించింది. నేడు జరిగిన ఫైనల్లో టునీషియా క్రీడాకారిణి ఆన్స్ జాబెర్ పై 3-6; 6-2;6-2 తేడాతో గెలుపొందింది.

గత ఏడాది క్వార్టర ఫైనల్స్ కు చేరుకొని టెన్నిస్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన రిబకినా, ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్స్ చేరుకొని సత్తా చాటింది. నేటి విజయంతో రిబకినా తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకుంది. జన్మతః రష్యా వాసి అయిన రిబకినా కజికిస్తాన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది.

మరోవైపు రన్నరప్ గా నిలిచిన జాబెర్ 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది, 2021 యూఎస్ ఓపెన్ లో మూడో రౌండ్ లోనూ, ఫ్రెంచ్ ఓపెన్ లో నాలుగో రౌండ్ లోనూ ఓటమి పాలై నిష్క్రమించింది. కానీ ఈ ఏడాది వింబుల్డన్ ఫైనల్స్ చేరుకొని తొలి టైటిల్ గెల్చుకోవాలని ఆశించినా అది ఫలించలేదు.  ప్రస్తుత ర్యాంకింగ్స్ లో జాబెర్ నంబర్.2 స్థానంలో ఉండగా, రిబకినా 23వ ర్యాంక్ లో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *