Friday, March 29, 2024
HomeTrending Newsత్వరలో ట్యాంక్ బండ్ పై నీరా కేఫ్

త్వరలో ట్యాంక్ బండ్ పై నీరా కేఫ్

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామని ఆబ్కారీ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్ లు తెరుస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ఇతర కులస్తులు కల్లు గీయకుండా.. కేవలం గౌడలే  వృత్తి ని చేపట్టేలా  ప్రత్యేక జీవో తెచ్చామని మంత్రి వెల్లడించారు. రవీంద్రభారతి లో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయ హస్తం  పథకాన్ని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

త్వరలో కల్లుగీత కార్మికులకు మంచి డిజైన్ తో కూడిన వాహనాలని అందిస్తామని మంత్రి వెల్లడించారు.  హైదరాబాద్ కోకాపేటలో గౌడ కులస్థుల కోసం 5 కోట్ల నిధులతో గౌడ భవన్ నిర్మిస్తామన్నారు. తల్లీ దండ్రులు చనిపోయిన గీత కార్మికుల పిల్లలను.. ప్రభుత్వ గురుకుల, రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకొనే వెసులు బాటు కల్పిస్తామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోటలకు సంరక్షణ చర్యలు చేపట్టి వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు తాటి, ఈత వనాలను ప్రతి గ్రామంలో పెంచుతున్నామన్నారు.

సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హరితహారంలో భాగంగా  3.80 కోట్ల తాటి, ఈత మొక్కలను కొత్తగా పెట్టి కులవృత్తులు కాపాడేందుకు  కృషి చేస్తున్నామన్నారు. కల్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని సాంకేతికంగా నిరూపణ జరిగిందన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్ లో కల్లు కాంపౌండ్లు మూసివేస్తే, మాట తప్పకుండా కల్లు కాంపౌండ్లు ఓపెన్ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి చెప్పారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్, బీసీ వెల్పేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం,  రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్,  స్టేట్ ఫైనాన్స్ మాజీ చైర్మన్ రాజేశం గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు మరణించిన 126 మంది  గీత వృత్తిదారులకు 5 లక్షలు,  శాశ్వత వైకల్యం పొందిన  147 మందికి 5 లక్షలు, తాత్కాలిక అంగ వైకల్యం పొందిన 315 మందికి 10 వేల రూపాయలను  మొత్తం 588 మంది లబ్ధిదారులకు 13.96 కోట్ల రూపాయలను గీత వృత్తి దారులకు ఎక్స్ గ్రేషియాను మంత్రులు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్