దేశ వ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్ ను ప్రవేశ పెట్టింది. నేటితో (ఏప్రిల్ -1) సేవ్ టైగర్ ఉద్యమానికి యాభై ఏళ్లు నిండాయి. దేశ వ్యాప్తంగా ప్రాజెక్ట్ టైగర్ కింద తీసుకున్న చర్యల వల్ల పులుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1973 లో 1827గా నమోదైన పులుల సంఖ్య 2022 నాటికి 2967 కు చేరింది. టైగర్ రిజర్వుల సంఖ్య తొమ్మిది నుంచి 53 కు పెరిగింది. ప్రాజెక్ట్ టైగర్ ప్రాధాన్యతను రాజ్యసభ ఎంపీ, అడవులు, పర్యావరణంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

సేవ్ టైగర్ ఉద్యమం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా తెలంగాణకు చెందిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు విడుదల చేసిన టైగర్ బుక్, టీ షర్ట్, కాఫీ మగ్ సావనీర్లను ఎంపీ సంతోష్ కుమార్ ప్రదర్శించారు. తెలంగాణ ప్రభుత్వం, అటవీశాఖ ద్వారా అమ్రాబాద్, కవాల్ పులుల అభయారణ్యంలను చాలా బాగా నిర్వహిస్తోందని, పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎం.పీ అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపుకు, పర్యావరణ రక్షణపై అవగాహన పెంపుకు కృషి చేస్తున్నామని, పులుల రక్షణకు తమ మద్దతు ఉంటుదని తెలిపారు. పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగాన ఉంటుందని, కొత్త తరాలకు ఈ అమోఘమైన జంతువును చూసి, కాపాడాల్సిన బాధ్యత అందించాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్, రాఘవ, శ్రీకాంత్ బందు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *