Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఎడ‌తెర‌పి లేకుండా పడుతున్న భారీ వ‌ర్షాల‌తో త‌మిళ‌నాడు అత‌లాకుత‌లం అవుతోంది. ధ‌ర్మ‌పురి, సేలం, ఈరోడ్, కృష్ణ‌గిరి జిల్లాల్లో  కుంభవృష్టి ధాటికి జనజీవనం అస్తవ్యస్తం అయింది. ధ‌ర్మ‌పురి -బెంగ‌ళూరు హైవేపై భారీగా వ‌ర‌ద నీరు చేరటంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో నాగపట్నం, మైలదుతురై, తంజావూరు జిల్లాల్లో విద్యాలయాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు.  కావేరి న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. కావేరి పరివాహకప్రాంతంలోని కుమార‌పాల‌యం అనే గ్రామం పూర్తిగా నీట మున‌గ‌గా, కృష్ణ‌గిరి జిల్లాలో ఇల్లు కూలి ఇద్ద‌రు మృత్యువాత ప‌డ్డారు.

నిన్నటి నుంచి వర్షాల ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్న సిఎం స్టాలిన్ వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. లోత‌ట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్ర‌మంలో మెట్టూరు డ్యాం ప‌రివాహ‌క ప్రాంతాల‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. మ‌రోవైపు నీలగిరి, కోయంబత్తూర్ జిల్లాల్లో కుండపోత వర్హాలకు అవకాశం ఉందని, ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు రోజులపాటు తమిళనాడు అంతటా వర్షాలు ఉన్నాయని.. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు కేంద్రంగా వర్షాలు తీవ్రస్థాయిలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com