Sunday, September 8, 2024
HomeTrending NewsHimachal Floods: హిమాచల్ ప్రదేశ్ లో వరుణుడి ఉగ్రరూపం

Himachal Floods: హిమాచల్ ప్రదేశ్ లో వరుణుడి ఉగ్రరూపం

హిమాచల్ ప్రదేశ్ లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలకు పర్వత రాష్ట్రం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని సిమ్లాలో అత్యధికంగా 11 మంది మరణించారు. మృతి చెందిన 30 మందిలో ఇప్పటి వరకు 29 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు భారీ వర్షం కారణంగా సంభవించిన వరదలకు సుమారు రూ.3,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా.

వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో చందర్తాల్, పాగల్ నల్లా, లాహౌల్, స్పితి సహా పలు ప్రాంతాల్లో సుమారు 500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఇక ఉనా జిల్లాలోని మురికివాడను వరదలు ముంచెత్తాయి. అందులో చిక్కుకుపోయిన 515 మంది కార్మికులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సురక్షితంగా రక్షించారు.

వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖ్ ప్రజలకు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వరదల కారణంగా చిక్కుకుపోయిన పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని.. ప్రతి జిల్లాలోనూ మంత్రులు ఉంటూ అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్