Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఆగష్టు 4 నుంచి ప్రారంభం కానున్న ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ క్రికెట్ అభిమానుల సమక్షంలోనే జరగనుంది. స్టేడియం సీటింగ్ కెపాసిటీకి సరిపడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తారు. కోవిడ్-19 నిబంధనలను మరింత సరళతరం చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాంశాలు తిలకించేందుకు ఇప్పటివరకూ ఉన్న ‘పరిమిత సంఖ్య’ నిబంధనను కూడా ఎత్తివేశారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటివరకూ ఉన్న చట్టబద్హమైన నిబంధనలు తొలగిస్తున్నామని, వైరస్ బారిన పడకుండా ప్రజలే స్వీయ నియంత్రణ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాన్సన్ సూచించారు.

ఈ తాజా నిర్ణయంతో ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు ‘బార్మి ఆర్మీ’ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బార్మీ ఆర్మీ ట్వీట్ కు రీ-ట్వీట్ చేసిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రేక్షకుల సమక్షంలో ఆడేందుకు తాము కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నామని వెల్లడించాడు. ఇండియా- ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ నాటింగ్ హాంషైర్ లోని ట్రెంట్ బ్రిడ్జి స్టేడియంలో ఆగస్ట్ 4 న ప్రారంభం కానుంది.

గత నెలలో సౌతాంప్టన్ లో ఇండియా-న్యూ జిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులను స్టేడియం లోకి అనుమతించారు. ఈ మ్యాచ్ లో న్యూజిల్యాండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన సుమారు 20 రోజుల అనంతరం జూలై 14 నుంచి టీమిండియా ప్రాక్టిసు మొదలు పెట్టనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com