Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్న్యూజిలాండ్ తో తొలి టెస్ట్: ఇండియా 258/4

న్యూజిలాండ్ తో తొలి టెస్ట్: ఇండియా 258/4

India 258/4 :
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న మొదటి టెస్ట్ లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 4 వికెట్లకు 258 పరుగులు చేసింది.  ముగ్గురు ఆటగాళ్ళు శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, జడేజా అర్ధ సెంచరీలతో రాణించారు. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో నేడు మొదలైంది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ అజింక్యా రెహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఆటగాడు సిరాజ్ కు తుది జట్టులో స్థానం దక్కలేదు.

మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇండియా జట్టు స్కోరు 21 వద్ద తొలి వికెట్ (మయాంక్-13) కోల్పోయింది. ఆ తర్వాత గిల్-పుజారా రెండో వికెట్ కు 61 పరుగులు జోడించారు. అర్ధ సెంచరీ పూర్తి చేసిన గిల్, జేమిసన్ బౌలింగ్ లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు ఇంగ్లాండ్ సిరీస్ లో అంతగా రాణించని పుజారా ఈ మ్యాచ్ లోనూ కేవలం 26 పరుగులే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రహానే 35 పరుగులు చేసి ఔటయ్యాడు, 145 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శ్రేయాస్ అయ్యార్-రవీంద్ర జడేజా కలిసి ఇండియా ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఐదో వికెట్ కు అజేయంగా 113 పరుగులు జోడించారు. తొలిరోజు 84  ఓవర్ల పాటు ఆట జరిగింది. అయ్యర్ -75; జడేజా-50 పరుగులతో క్రీజులో ఉన్నారు.

న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమిసన్ మూడు వికెట్లతో రాణించాడు. మరో వికెట్ సౌతీకి దక్కింది.

Also Read : ఇండియా క్లీన్ స్వీప్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular