Sunday, September 8, 2024
HomeTrending Newsఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేశారు. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు (శనివారం) వెలువడ్డాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, ఇండియా కూటములకు తొలి పరీక్ష కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పశ్చిమ బెంగాల్‌ లోని 4 అసెంబ్లీ స్థానాలు, హిమాచల్‌ ప్రదేశ్‌ లోని మూడు, ఉత్తరాఖండ్‌ లోని రెండు, పంజాబ్, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నికలు జరిగాయి.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.13 స్థానాలలో 10 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్, మధ్యప్రదేశ్ లోని అమర్వాడ.. రెండుచోట్ల ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యం కనపరిచారు.

పంజాబ్‌ వాణిజ్య రాజధాని జలంధర్‌(పశ్చిమ) స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పశ్చిమబెంగాల్‌లోని మాణిక్ తాళ, బాగ్దా, రాణా ఘాట్‌ దక్షిణ్‌, రాయ్‌గంజ్‌.. మొత్తం నాలుగు స్థానాలను తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) కైవసం చేసుకుంది. నాలుగు స్థానాల్లో బిజెపి రెండో స్థానంలో నిలువగా కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని దేహ్రాలో ముఖ్య మంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సతీమణి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలేశ్‌ ఠాకుర్‌ విజయం సాధించారు. నాలాగఢ్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి హర్దీప్ సింగ్ బవా గెలిచారు. హమీర్‌పుర్‌ లో బీజేపీ నేత ఆశిష్ శర్మ జయకేతనం ఎగురవేశారు.

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, మంగలౌర్‌ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆధిక్యం సంధించారు. మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరన్‌ షాపై కమలేశ్ ప్రతాప్ షా గెలుపు ఖాయమైంది.

బిహార్‌లోని రూపౌలి స్థానంలో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. జేడీయూ అభ్యర్థి  వెనుకంజలో కొనసాగుతున్నారు. తమిళనాడులోని విక్రావండిలో డీఎంకే నేత అన్నియుర్‌ శివ విజయం సాధించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్