Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా అందరికీ అందుబాటులో ఉండేలా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌) సిద్ధం అయ్యింది. ఈ భవనాన్ని ఈనెల 7 న సీఎం శ్రీ కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం భవనం నిర్మించాలని ప్రభుత్వం 2017లో నిర్ణయించింది. ఎస్సారెస్పీ ఆబాది స్థలం 20 ఎకరాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 49.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన నవతేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కలెక్టరేట్‌ నిర్మాణానికి నవంబర్‌లో శ్రీకారం చుట్టింది. 8 ఎకరాల్లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాలను నిర్మించింది. వీటిని 6వేల చదరపు అడుగుల్లో జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం, 2877 చదరపు అడుగులలో అదనపు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం, 2130 చదరపు అడుగులలో జిల్లా రెవెన్యూ అధికారి క్యాంపు కార్యాలయాన్ని నిర్మించింది. ఇక జీప్లస్‌ 2 పద్ధతిలో 19,300ల చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లా స్థాయి అధికారుల గృహ సముదాయాలను నిర్మించింది. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, రెవెన్యూ అధికారుల క్యాంపు కార్యాలయాలను ఇప్పటికే ప్రభుత్వానికి అప్పగించింది. ప్రస్తుతం కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు ఆయా క్యాంపు కార్యాలయాల నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

IDOC లో 32 శాఖలకు గదులను నిర్మించారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల కోసం మూడు పెద్ద చాంబర్లను, విజిటర్స్‌ వెయింటింగ్‌ హాల్‌తో పాటు, ఇంటిగ్రేటెడ్‌ మీటింగ్‌ హాల్‌ను నిర్మించారు. మూడు మినీ మీటింగ్‌ హాల్స్‌ను తీర్చిదిద్దారు. కలెక్టర్‌, ఇద్దరు అదనపు కలెకర్లు, పరిపాలనా అధికారి చాంబర్లను కేస్ట్‌ సీలింగ్‌ (సెంట్రల్‌ ఏసీ) చేశారు. సమీకృత సమావేశ మందిరాన్ని సైతం సెంట్రల్‌ ఏసీగా మార్చారు. జీ+2 పద్ధతిన నిర్మించిన కలెక్టరేట్‌లో అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. కలెక్టరేట్‌ పైభాగంలోకి చేరుకునేందుకు రెండు, లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ సౌకర్యం కోసం 315 కేవీ సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను నిర్మించారు. 160 కేవీ సామర్థ్యం కలిగిన జనరేటర్‌ను అమర్చారు. సమీకృత కార్యాలయం చుట్టూ ప్రహరీ నిర్మించారు. మొత్తానికి నూతన హంగులతో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మాణామైన IDOC భవనం జగిత్యాల కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలువనుంది.

రూ.119 కోట్లతో నిర్మించనున్న వైద్య కళాశాల

జగిత్యాల కేంద్రంలో 119 కోట్ల 27.08 ఎకరాలలో మెడికల్ కళాశాల స్థాపన జరగుతుంది. వీటిలో 1.87 ఎకరాలలో మెడికల్ కళాశాల, 0.61 ఎకరాలలో విద్యార్థిని ల క్యాంపస్, 0.61 ఎకరాలలో విద్యార్థుల క్యాంపస్, 3.80 ఎకరాలలో ఆసుపత్రి ఉన్నాయి. 150 మంది విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్ ఎంబీబీఎస్ తరగతులు ఈ సంవత్సరం నవంబర్ 15 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల జిల్లా పర్యటన లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నూతన మెడికల్ కళాశాల భవనం కు భూమి పూజ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com