Sunday, September 8, 2024
HomeTrending Newsవెళ్లినవాటి గురించి మాట్లాడండి: అచ్చెన్న

వెళ్లినవాటి గురించి మాట్లాడండి: అచ్చెన్న

పారిశ్రామికంగా నాలుగేళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు సదస్సులు పెట్టడంవల్ల ఉపయోగం ఏమిటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు.  నాలుగేళ్ళు కుంభకర్ణుడిలా నిద్రపోయి, ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొచ్చే సమయానికి యువతను మోసం చేయడానికి విశాఖలో ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

తమ ప్రభుత్వ హయంలో  విశాఖలో మూడు సార్లు పారిశ్రామికసదస్సులు  నిర్వహించామని, 16 లక్షల కోట్ల రూపాయలకు ఎంవోయులు చేసుకున్నా మని గుర్తు చేశారు. 32లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా తాము పెట్టుకున్నామని, దీనితో పాటుగా ఐదుసార్లు దావోస్ వెళ్లి 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని వివరించారు. తమ హయంలో 5 లక్షల 13 వేల మందికి ఉద్యోగాలు వచ్చినట్లు ఈ ప్రభుత్వమే స్వయంగా ఒప్పుకుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ కేంద్ర కార్యాలయంలో  నక్కా ఆనందబాబు, పరుచూరి అశోక్ బాబులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలపై వాస్తవ పత్రం పేరిట ఓ నివేదికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు రాష్ట్రంమీద తీసుకొచ్చిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని సిఎం జగన్ తన అవినీతితో నాశనం చేశారని ఆరోపించారు. తమ హయంలో ఒప్పందాలు చేసుకున్న పారిశ్రామిక వేత్తలను కూడా పిలిచి భయపెట్టారని ధ్వజమెత్తారు.  కియా పరిశ్రమ ఎవరు తెచ్చారని…  జాకీ, లూలూ, పాంక్లిన్ టెంపుల్టన్, అదానీ డేటా సెంటర్ లాంటివి ఎందుకు తరలిపోయాయని  ప్రశ్నించారు.  ప్హోరత్దాయెక గురించి మాట్లాడడంలేదని, విశాఖ స్టీల్, విశాఖ-చెన్నై కారిడార్, విశాఖ మెట్రో రైల్ లాంటి వాటి సంగతి ఏమిటని అడిగారు.   సిఎం జగన్ ముందుగా వెళ్ళిపోయిన పరిశ్రమల గురించి మాటాడి క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు  డిమాండ్ చేశారు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉండడం ముఖ్యం కాదని… ప్రభుత్వంపై నమ్మకం విశ్వాసం ఉండాలని అన్నారు.సమ్మిట్ పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read : ఏపీలో వనరులు పుష్కలం : సిఎం జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్