Monday, June 8, 2026
HomeTrending Newsపాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికలు

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎన్నికలు

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జూలై  నెల 25 వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన ఎన్నికల అధికారి అబ్దుల్ రషిద్ సులేరియా ఆక్రమిత కశ్మీర్  రాజధాని ముజఫరబాద్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని రేడియో పాకిస్తాన్ వెల్లడించింది. రాష్ట్రంలో 28 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని, ఈ దఫా కొత్తగా నాలుగు నియోజకవర్గాలు ఏర్పాటు చేసినట్టు సులేరియా పేర్కొన్నారు.

ఆక్రమిత కశ్మీర్ లో 45 నియోజకవర్గాలు ఉండగా అందులో ౩౩ ఆక్రమిత కశ్మీర్ ప్రజల కోసం కేటాయించారు.  భారత్ నుంచి వచ్చిన కశ్మీర్ శరణార్థుల కోసం 12 సీట్లు ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు. కరోన కేసులు పెరుగుతుండటంతో రెండు నెలల నుంచి వాయిదా వేస్తూ వస్తున్న ఎన్నికలకు ఎట్టకేలకు మోక్షం లభించింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 2016 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి  నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధికారం లోకి వచ్చింది. అంతర్జాతీయంగా మెప్పు కోసమే ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఆ తర్వాత ప్రజల యోగ క్షేమాలు పట్టించుకునే నాథుడే లేడనే ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు ఆక్రమిత కశ్మీర్లో  ఎన్నికలు సహేతుకం కాదని భారత దేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఏడాది గిల్గిత్ – బాల్టిస్తాన్ లో ఎన్నికల నిర్వహణ పై ఇండియా తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది.  ఆక్రమిత కాశ్మీర్ , గిల్గిత్ – బాల్టిస్తాన్ లో పాకిస్థాన్ ప్రభుత్వం నిర్వహించే ఎన్నికలకు అంతర్జాతీయంగా ఆమోదం లేదని భారత్ విమర్శించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular