Friday, April 26, 2024
Homeసినిమాజయమ్మ పాత్రను పోషించడం అంత ఈజీ కాదు : కంగనా రనౌత్

జయమ్మ పాత్రను పోషించడం అంత ఈజీ కాదు : కంగనా రనౌత్

సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషించగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశా విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా కంగనా రనౌత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

“తలైవి అనేది జయలలిత పదహారేళ్ల నుంచి మొదలైంది నలభై ఏళ్ల వరకు ఉంటుంది. అందుకే నేను కూడా పాత్రకు తగ్గట్టు ఇరవై కేజీల వరకు పెరిగాను. నేను ఈ సినిమాలోకి రచయిత విజయేంద్ర ప్రసాద్ గారి వల్లే వచ్చాను. ఆయన నా ‘మణికర్ణిక’ సినిమాకు కూడా రాశారు. ఆయనే నా పేరును ఈ ప్రాజెక్టుకు సూచించారు. అలా నిర్మాతలు నన్ను సంప్రదించారు. అమ్మ పాత్రను పోషించడం అంత ఈజీ కాదు. కానీ దర్శకుడే నాలో ధైర్యాన్ని నింపారు. నన్ను నమ్మారు. జయలలితను అందరూ కూడా తక్కువ అంచనా వేశారు. ఆమె అంతలా ఎదుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. తండ్రి లేని అమ్మాయి. సినిమాల్లోకి వచ్చినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు. ఇక రాజకీయాల్లోకి  వచ్చినప్పుడు ఎంతో మంది అవమానించారు. అయితే.. ఆ తరువాత ఆమె చక్రం తిప్పారు. కథ విన్నప్పటి నుంచి నేను జయమ్మకు అభిమానిగా మారాను. సినిమా కోసం జయమ్మలా మారిపోయేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక వేళ ఆమె పాత్రకు న్యాయం చేయకపోతే ఎలా అనే అనుమానం కూడా వచ్చింది. ఆమె నాకు ముఖ్యమంత్రిగానే తెలుసు అలాగే పెద్ద నటి అని కూడా తెలుసు. అంతకంటే ఎక్కువగా తెలియదు” అని కంగనా వెల్లడించింది.

“జయలలిత గారిని జూనియర్ ఆర్టిస్ట్ కూతురు అని అన్నారు.. ఆమెకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా వచ్చారు.. టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్ను కూడా వెక్కిరించారు. పహాడి అమ్మాయి.. ఆమె ఏం చేయగలదు అని అన్నారు. కానీ నేను కూడా ఎన్నో విజయాలు సాధించాను. కానీ నా ప్రయాణం ఇక్కడే ఆగింది. జయమ్మ గారు రాజకీయాల్లోనూ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యం ఇప్పుడు అయితే లేదు. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి.. ఎంతో మందికి దగ్గరవ్వాలి.. తెలుగు, తమిళంలో ఇలా అన్ని భాషల్లో ఇంకా సినిమాలు చేయాలి. ఇప్పుడైతే రాజకీయాల గురించి ఆలోచించడం లేదు” అని తెలిపింది.

“సమాజానికి మంచి చేయాలి.. సేవా తత్వం ఉన్న వాళ్లు రాజకీయాల్లోకి వస్తారు.. కానీ అందులో కొంత మంది కరప్ట్ అవుతుంటారు అని అనుకునే దాన్ని. కానీ రాజకీయాలనేవి చదరంగం అని ఈ సినిమా చేశాక తెలిసింది. ఓటు బ్యాంకుతోనే రాజకీయాలు చేస్తారని తెలిసిందే. ‘తలైవి’ చేశాక నాకు రాజకీయాల మీద పూర్తి అభిప్రాయం మారింది. మా జీవితాలు ఒక్క శుక్రవారం మీద ఆధారపడుతుంది. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఎన్నో ఏళ్లు కష్టపడతారు. వారికంటూ ఓ కోటను నిర్మించుకుంటారు. ఆమె ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగారు.. ఎలా ఎదిగారు.. ఎంత ఘనంగా బతికారు అని ఇందులో చూపించాం”

“ఆమె గురించి ఎంతో చదివాను.. జయలలిత జీవితంలోని ముఖ్య ఘటనల గురించి తెలుసుకున్నాను. ఆమె ఆ సమయంలో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ఇలా ఊహించుకోవడం మొదలుపెట్టాను. పైగా తమిళనాడు ప్రజలకు జయలలిత జీవితం గురించి అంతా తెలుసు. ఇందులో సినిమాటిక్ లిబర్టీ తీసుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఓ మహిళగా ఆమె ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుందో అవతలి నుంచి ఊహించుకున్నాను. అదే మానసికంగా ఈ సినిమాకు నేను పడ్డ కష్టం. శారీరక కష్టానికి వస్తే.. భరతనాట్యం నేర్చుకున్నాను. జయమ్మ గొప్ప భరతనాట్య కళాకారిణి. సినిమాలు ఆపేశాక.. ఆమె డ్యాన్స్ స్కూల్ పెట్టుకున్నారు. ఎన్నో విదేశాల్లో షోలు చేశారు. ఇక ఆ పోర్షన్ కోసం భరత నాట్యం నేర్చుకోవాల్సి వచ్చింది”

“ప్రస్తుతం ఇందిరాగాంధీ బయోపిక్ చేస్తున్నాను. ఇంకా ఎంతో మంది వీరనారుల చరిత్రలున్నాయి. ప్రస్తుతం ఇందిరా గాంధీ పాత్రను పోషించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. హైద్రాబాద్‌లో ఎన్నో సినిమాలకు షూటింగ్ చేశాను. ‘మణికర్ణిక’ షూటింగ్ ఇక్కడే చేశాను. నాకు ఇష్టమైన ప్రదేశాల్లో హైద్రాబాద్ ఒకటి. మనాలి తరువాత ఇదే నాకు ఇష్టం. ఇక్కడి వాతావరణం, ఫుడ్ ఎంతో ఇష్టం. ఇక్కడ చాలా మంది స్నేహితులున్నారు. హైద్రాబాద్ బ్యూటీఫుల్ సిటీ. ‘తలైవి’ సెట్‌లో విజయ్ గారితో పాటు దాదాపు ఆరుగురు దర్శకులున్నారు. నేను, అరవింద్ స్వామి, సముద్ర ఖని సర్ ఇలా చాలా మంది ఉన్నాం. ఓ దర్శకుడితో మరో దర్శకుడు నటింపజేయడం చాలా కష్టం. మేం ఎన్నో డౌట్స్ అడుగుతుంటాం. కానీ విజయ్ గారు ఎంతో కూల్‌గా అన్నీ వివరించి చెప్పేవారు. ఆయనకు ఏం కావాలో అడిగి మరీ చేయించుకునే వారు. ఎప్పుడూ ఒకే పని చేయడం నాకు విసుగునిస్తుంది. నటించడమే కాకుండా కథలు రాయడం, దర్శకత్వం చేయడం వంటివి చేయడం ఇష్టం”

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి.. బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఎవరు ఎలాంటి అభిప్రాయాలు వెల్లిబుచ్చినా నేను ఏం చేయలేను. కానీ ఈ పాత్రకైనా, ఏ పాత్రకైనా అవార్డు వస్తుందా? అనేది నేను చెప్పలేను. ప్రజలు చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ల సినిమాలు, పాత్రలు కూడా చూడాలి. మంచి అవకాశాల కోసం మనం ఎదురుచూడాలి. తమిళంలో ‘ధామ్ ధూం’ సినిమా ఎప్పుడో చేశాను.. తరువాత విజయ్ సార్ ఈ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు కూడా పూరి సర్‌ని అడుగుతుంటాను.. ఇప్పుడు ప్రభాస్ పక్కన చాన్స్ ఇవ్వండి.. నేను ఎందుకు చేయను అని అంటాను. ఆయన పిలిస్తే మళ్లీ సినిమా చేస్తాను. పిలవాలని ఆశిస్తున్నాను” అంటూ పలు విశేషాలు తెలియజేసింది కంగనా రనౌత్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్