ఉత్తరాఖండ్ కేదార్నాథ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఫాటా నుంచి కేదార్నాథ్ కు యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ ఈ రోజు (మంగళవారం) ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో పైలట్ తో సహా ఐదుగురు మరణించినట్లు సమాచారం. కేదార్నాథ్కు 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
కేదార్నాథ్లో దట్టమైన పొగమంచు అలముకుందని… దీని కారణంగానే హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. హెలికాప్టర్ ఆర్యన్ కంపెనీకి సంబంధించినదిగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కేదార్నాథ్కు బయలుదేరిన హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. “కేదార్నాథ్లో హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరం. నష్ట తీవ్రత తెలుసుకోవడానికి రాష్ట్రప్రభుత్వంతో సంప్రదిస్తున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం..” అని ట్వీట్ చేశారు.
గతంలో…
కేదార్నాథ్లో హెలికాప్టర్ కూలడం ఇదే తొలిసారి ఏమీ కాదు. 2013 కేదార్నాథ్ విపత్తు సమయంలో వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్తో సహా మూడు హెలికాప్టర్లు రెస్క్యూ చేస్తున్న సమయంలో కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019లో కూడా ప్రయాణీకులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ సాంకేతిక లోపం తలెత్తి కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు.