Sunday, September 8, 2024
HomeTrending Newsబలవంతంగా హిందీ భాష వద్దు - మంత్రి కేటిఆర్

బలవంతంగా హిందీ భాష వద్దు – మంత్రి కేటిఆర్

దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు కల విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలో మాత్రమే బోధన ఉండాలన్న హోంమంత్రి అమిత్ షా సారద్యంలోని పార్లమెంటరీ కమిటీ అన్ అఫీషియల్ లాంగ్వేజెస్ నివేదికను తప్పుపట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా హిందీ భాషలోనే నిర్వహించడంపై ప్రధాని మోడీకి కేటీఆర్ లేఖ రాశారు.

ఐఐటీ-ఎన్ఐటి లాంటి ఉన్న విద్యా సంస్ధల్లో హిందీ మీడియం ఖచ్చితం చేయాలన్న సూచనపై కేటీఆర్

దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం మరింత ముమ్మరం చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ఆరోపించారు. ఐఐటీ, ఎన్.ఐ.టీ లాంటి ప్రపంచస్థాయి ప్రమాణాలు కల విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలోనే విద్యాబోధన ఉండాలని హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించడంపై కేటీఆర్ మండిపడ్డారు. కేవలం 40 శాతం ప్రజలు మాత్రమే మాట్లాడే హిందీ భాషను బలవంతంగా దేశం మొత్తానికి అంటకట్టడం దుర్మార్గం అన్నారు. భారత రాజ్యాంగం ఏ భాషకు అధికారిక హోదా ఇవ్వలేదని, రాజభాషా అని హిందీకి పట్టం కట్టలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 22 భాషలను అధికారిక భాషలుగా మాత్రమే మన రాజ్యాంగం గుర్తించిందన్న కేటీఆర్, మోడీ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్దమన్నారు. ఇవాళ ప్రపంచ స్థాయి సంస్థలు, కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహించడానికి, మల్టీనేషనల్ కంపెనీల్లో మన యువత మెజార్టీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలో చదవడమే కారణమన్నారు కేటీఆర్. గ్లోబలైజేషన్ జమానాలో మిగతా ప్రపంచంతో మనం కనెక్ట్, కమ్యూనికేట్ అవ్వడానికి ఇంగ్లీష్ తో మాత్రమే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అయితే మోడీ ప్రభుత్వం హిందీ భాషకు అనవసర ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని తిరోగమన స్థితిలోకి వేగంగా తీసుకుపోతుందని కేటీఆర్ విమర్శించారు. అన్ని స్థాయిల్లో హిందీ భాషను కచ్చితం చేయాలనుకుంటున్న మోడీ ప్రభుత్వ విధానాలతో ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతాయని కేటీఆర్ తెలిపారు. అన్ని భాషలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలన్న భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ హిందీ భాషను బలవంతంగా దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నాలను మానుకోవాలని ప్రధాని మోడీని కేటీఆర్ డిమాండ్ చేశారు. వేంటనే అమిత్ షా సారద్యంలోని కమీటి ఇచ్చిన నివేదికను పక్కనపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అర్హత పరీక్షలు హిందీ మీడియంలో ఉండడంపై కేటీఆర్

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నియామక పరీక్షలు హిందీ, ఆంగ్ల భాషలోనే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషల్లో కాకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈ నిర్ణయం కాలరాస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలన్నింటిని ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని డిమాండ్ చేస్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ రాశారు. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాంతీయ భాషల్లోనే ఉన్నత విద్య ఉంటుందని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఇంగ్లీష్, హిందీలకే ప్రాధాన్యత ఇచ్చి తన చిత్తశుద్దిలోని డొల్లతనాన్ని బయటపెట్టుకుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేవలం హిందీ, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారికి మాత్రమే ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లతో ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇది కేవలం 12 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదన్న కేటీఆర్, మాతృ భాషలో చదువుకున్న కోట్లాది మంది ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని భవిష్యత్తులోనూ అన్ని ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యం ఇస్తామన్నా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న తెలుగు రాష్ట్రాల యువకుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ అన్నారు.

ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువకులకు ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు దక్కేలా ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గతంలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారని తెలిపారు. 2020 నవంబర్ 18 వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు లేఖ కూడా రాశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఖాళీగా ఉన్న లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటిదాకా నోటిఫికేషన్లు వేయని మోడీ ప్రభుత్వం, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలను హిందీ, ఇంగ్లీష్ లో నిర్వహిస్తూ మాతృభాషలో చదువుకున్న కోట్లాది మంది ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తుందని మండిపడ్డారు. ఆర్టికల్ 345 ప్రకారం అధికారిక భాష అనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని, హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం భారత రాజ్యాంగ సమాఖ్య స్పూర్తికి విరుద్దమని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఢిల్లీలో ఉండే కొంతమంది బ్యూరోక్రాట్లు, నేతలు ఇంకా బ్రిటిష్‌ కాలం నాటి వలసవాద, ఆధిపత్య భావజాలాన్ని మోస్తున్నారనడానికి సివిల్స్‌ ప్రాథమిక(ప్రిలిమ్స్‌) పరీక్షల ప్రశ్నపత్రాలన్నీ ఇంగ్లీష్, హిందీలోనే ఉండడమే సాక్ష్యమని కేటీఆర్ విమర్శించారు. బలహీన వర్గాలంటే ఆయా వ్యక్తులకు ఉండే చిన్నచూపు, ప్రాంతీయ వివక్షతో సివిల్స్ పరీక్షల్లో గ్రామీణ అభ్యర్థులకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఈ సంకుచిత ఆలోచన విధానంతో దేశ యువత తీవ్రంగా నష్టపోతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత సర్వీసులంటూ అధికశాతం పరీక్షలను ఆంగ్లం, హిందీల్లోనే నిర్వహించడం వల్ల మాతృభాషల్లో చదువుకుని ఆయా అంశాల మీద మంచి పట్టున్న అభ్యర్థులు నష్టపోతున్నారని కేటీఆర్ చెప్పారు. సివిల్స్ ప్రిలిమ్స్ ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడంతో పాటు మేయిన్స్, ముఖాముఖిలో అనువాదకుల అవసరం లేకుండా ఆయా భాషలు తెలిసిన అధికారులతోనే బోర్డులు ఏర్పాటుచేయాలని ప్రధాని మోడీని కేటీఆర్ డిమాండ్ చేశారు.

యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్‌, ఎకనామిక్‌ సర్వీసు పరీక్షలతో పాటు గిరిజనులు, గ్రామీణులతో మమేకమై విధులు నిర్వర్తించే ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారుల ఎంపికలోనూ ఇంగ్లీషుకు మాత్రమే పెద్దపీట వేయడం అన్యాయమన్నారు. ప్రస్తుత స్టాఫ్ సెలక్షన్ నోటిఫికేషన్ మాత్రమే కాకుండా అనేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియాకమాక పరీక్షలన్నీ దాదాపుగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే నిర్వహిస్తున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో 20 కు పైగా ఉద్యోగ నియామక సంస్థలున్నాయన్న కేటీఆర్, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్స్‌) పరీక్షలకు ఏటా లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారని చెప్పారు. అఖిల భారత స్థాయి ఉద్యోగాలకు యూపీఎస్సీ నిర్వహించే 16 కు పైగా నియామక పరీక్షలు కూడా హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే ఉంటాయన్నారు. 2017-2020 మధ్య యూపీఎస్సీ పరీక్షలకు దాదాపు 90 లక్షల మంది, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు కోటీ ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్న కేటీఆర్, ప్రాంతీయ భాషల్లోనూ ఆయా పరీక్షలు నిర్వహిస్తే మరింత ఎక్కువ మంది పోటీ పడేవారన్నారు. జాతీయ స్థాయి ఉద్యోగ నియామకాల్లో అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సమాన, న్యాయమైన అవకాశాలు దక్కాలంటే అర్హత పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ప్రధానమంత్రి మోడీని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు దాదాపు బ్యాంకుల ద్వారానే అమలవుతాయన్న కేటీఆర్, స్థానిక భాష తెలియని బ్యాంకు సిబ్బందితో గ్రామీణులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 2014 ముందు వరకు ప్రాంతీయ భాషల్లో బ్యాంకు నియామక పరీక్ష రాసే అవకాశం ఉండేదని, కాని ప్రస్తుతం ఇంగ్లిష్‌, హిందీల్లోనే నిర్వహిస్తుండడంతో ప్రాంతీయ భాషలో చదువుకున్న స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. బ్యాంకు నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండేళ్ల క్రితం ఇచ్చిన హామి “జుమ్లా” తప్ప మరొకటి కాదని కేటీఆర్ విమర్శించారు.

దేశంలోని చాలా రాష్ట్రాలలో విద్యార్థులు తమ మాతృభాషాలోనే విద్య అభ్యసిస్తున్నారని, ఇంగ్లిష్, హిందీ భాషలను కేవలం ఒక అంశంగా మాత్రమే చదువుతున్నారని కేటీఆర్ తెలిపారు. తాము పొందిన జ్ఞానం, భావనలు ఇతర భాషలలో అనువదించుకొని, ఆ పదజాలాన్ని అవగాహన చేసుకొని పరీక్షలలో పోటి పడి ఉద్యోగం సాధించడం అంత సులువుకాదన్నారు. వివిధ విషయాల పట్ల మాతృభాషలో పరిజ్ఞానం, అవగాహన ఉండి కూడా ఎంతోమంది అవకాశాలను అందుకోకపోవడానికి ఇదే ముఖ్య కారణం అన్నారు. ఒక ఉద్యోగి ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం చేయవలసిన సందర్భాలలో హిందీ, ఇంగ్లిష్‌ పరిజ్ఞానం అవసరమే అన్న కేటీఆర్, ఆయా భాషలలో ప్రాథమిక పరిజ్ఞానం పరిశీలించడానికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మొత్తం జ్ఞానం అంతా పరాయి భాషలోనే ఉండాలనుకోవడం అశాస్త్రీయం, అన్యాయం అన్నారు.
భారత జనాభాలో 40% మంది మాత్రమే మాట్లాడే హిందీ భాషని మెజార్టీ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. సివిల్స్, రైల్వే, పోస్టల్, రక్షణ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ తో పాటు నెట్‌, జనరల్‌ స్టడీస్‌ పరీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో నిర్వహించే పరీక్షలను ప్రాంతీయ భాషలలో రాసేందుకు అవకాశం కల్పించే విషయమై తక్షణం ఒక నిపుణుల కమిటీ నియమించాలని ప్రధానమంత్రి మోడీని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Also Read :  హిందీపై ‘అమిత’ప్రేమ

RELATED ARTICLES

Most Popular

న్యూస్