Sunday, May 19, 2024
HomeTrending Newsసిలిండర్ ధర పెంపు...మహిళలకు మోడీ కానుక - కేటిఆర్ విమర్శ

సిలిండర్ ధర పెంపు…మహిళలకు మోడీ కానుక – కేటిఆర్ విమర్శ

రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని మంత్రి కేటిఆర్ విమర్శించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపైన మండిపడిన కేటీఆర్…గృహ అవసరాల సిలిండర్ ధరను 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధరను 350 రూపాయల మేర భారీగా పెంచిందని మండిపడ్డారు. భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు ఈ రోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ…అటు ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఈరోజు ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన కానుకనా ఈ సిలిండర్ ధరల పెంపు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఎల్లుండి అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సిలిండర్ ధరల పెంపు పైన నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపు ఇచ్చారు. ఎక్కడి వారక్కడ వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

మహిళా దినోత్సవం రోజున సైతం గ్యాస్ ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కేటిఆర్ పార్టీ శ్రేణులను కోరారు. మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు 1160ని దాటి 1200లకు చేరుకుందన్నారు. పెరుగుతున్న సిలిండర్ ధరలపైన ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి… పెరుగుతున్న సిలిండర్ ధరలు, నిత్యవసర సరుకుల పెరుగుదల పైన ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉన్నది. ఈ ధరల పెరుగుదల వలన ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే మాదిరిగా… కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నేతలకు కేటిఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచుతున్న తీరును స్థానికంగా మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చూడాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ఉజ్వల స్కీం పేరుతో మాయమాటలు చెప్పిన బిజెపి ప్రభుత్వం… ఈరోజు భారీగా సిలిండర్ ధరలను పెంచుతున్నది. వారిని సిలిండర్కు దూరం చేస్తున్నదన్నారు. ఉజ్వల స్కీంలో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళ సైతం ఈరోజు సిలిండర్ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డగోలుగా సిలిండర్ ధరలను పెంచకుండా, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ కేటీఆర్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్