Sunday, May 19, 2024
HomeTrending Newsమెట్రో రైల్ విస్తరణపై సమీక్ష

మెట్రో రైల్ విస్తరణపై సమీక్ష

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని మంత్రి కే. తారకరామారావు ఈరోజు నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,డిజిపి, మెట్రో రైల్, పురపాలక, ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందని, శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 9వ తేదీన శంకుస్థాపన వేసే ప్రాంతంతో పాటు కెసిఆర్ పాల్గొనే సమావేశ ప్రాంగణం వంటి వాటి ఏర్పాట్లను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన స్థలాల పరిశీలనకు రేపు మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలన చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి నగరంలోని ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికల పైన ఇప్పటినుంచే కసరత్తు చేయాలని పోలీస్ శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని, ఇది మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కావడం వలన నగర వ్యాప్తంగా ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు కావాలని కేటీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అవసరమైన నగర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి లకు మంత్రి కేటీఆర్ సూచించారు.

Also Read : రాయదుర్గం నుంచి శంషాబాద్ కు మెట్రో 

RELATED ARTICLES

Most Popular

న్యూస్