Friday, March 29, 2024
HomeTrending NewsRolla Vaagu: ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Rolla Vaagu: ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తారని, జిల్లాల్లోని రోళ్ల వాగులో 1 టీఎంసీ నీరు నిల్వ చేసే వరకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని సమావేశాలు నిర్వహిస్తూ చెరువులు, కుంటల వద్ద విందు ఏర్పాటు చేయడం ఆశ్చర్యమన్నారు. మిషన్ కాకతీయ ఎనిమిదేళ్ళ క్రితం చేపట్టారని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదని విమర్శించారు. గుర్రపు డెక్క, విష పూరితమైన పాల సముద్రపు మొక్కలతో చెరువుల్లో నీటిని పశువులు కూడా నీరు తాగలేని పరిస్థితి ఉందన్నారు.
మోతే చెరువు రెండేళ్లలో రెండు సార్లు తెగిపోయిందని, 2021లో తెగడంతో తాత్కాలిక పనులు చేయడంతో మళ్ళీ తెగిందన్నారు. మరమత్తుల కోసం ఏ నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు.రోల్ల వాగు, సురమ్మ చెరువు, సదర్ మాట్ ప్రాజెక్ట్ ల అడుగు ముందుకు పడడం లేదన్నారు.
రూ.60 కోట్ల అంచనాతో రోల్ల వాగును 0.25 నుండి 1 టీఏంని చేయాలని 2015లో ప్రారంభించారని, ఇంత వరకు రోళ్ళ వాగు పెంపుతో ముంపుకు గురయ్యే వెయ్యి ఎకరాల అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా భూముల కేటాయింపు కొలిక్కి రాలేదన్నారు. సీతారాం ప్రాజెక్ట్ కోసం జగిత్యాల భూములు అప్పగించడంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశామని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా భూములు ఖమ్మం సీతారాం ప్రాజెక్ట్ కు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018కి ముందు సూరమ్మ చెరువు మంత్రి హరీష్ రావు ప్రారంభించినా ఇంత వరకు పూర్తి కాలేదన్నారు. సదర్ మట్ బిల్లుల చెల్లింపుల జాప్యంతో అతీగతీ లేదన్నారు. ఎకరానికి సగటున 20 క్వింటాల్ చొప్పున ప్రతి రైతు ఎకరానికి రు.2వేలు నష్టపోతున్నారన్నా, అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ధర్మ కాంటను పరిగణలోకి తీసుకోవాలని, రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని చెప్పినా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులు మోసానికి గురి అవుతుంటే అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ధాన్యం సేకరణ 50 శాతం కూడా చెల్లింపులు చేయలేదని, విందుల కోసం ఊరికి రు.25-30 వేలు ఇవ్వడం ఏమిటిని, ముందు ధాన్యం సేకరణ బిల్లు చెల్లింపులు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి నాయకులు బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, పూర్ణచందర్ రెడ్డి,
గుండా మధు, మామిడాల మహిపాల్, రాజేష్, కిషోర్, బండారి మధు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్