Saturday, April 20, 2024
HomeTrending Newsటీఆర్‌ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా

టీఆర్‌ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా

మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్న టీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తలిగింది. టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ పంపారు బూర నర్సయ్య గౌడ్. 2009 నుంచి తెలంగాణ ఉద్యమం, పార్టీ ప్రస్థానంపై లేఖలో ప్రస్తవించారు. 2019లో ఎంపీగా ఓడిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొంటున్నానని బూర నర్సయ్య గౌడ్ లేఖలో పేర్కొన్నారు. పైరవీలు చేసే వ్యక్తిని కాదని తెలిసినా.. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో ఆత్మగౌరవ సభ సందర్భంగా సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగి ఉన్నానన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో వివక్షకు గురికావడం బాధాకరమన్నారు.

2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా గెలిచారు బూర నర్సయ్య గౌడ్. తిరిగి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ భువనగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సొంత పార్టీ నేతలే బూర నర్సయ్య గౌడ్ ను ఓడించారనే ప్రచారం జరిగింది. ఇదే విషయంపై పార్టీ అధిష్టానానికి కూడా బూర నర్సయ్యగౌడ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రతీ సమయంలో తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎక్కువగా ఓసీ నేతలే గెలిచారని.. ఈ సారి టీఆర్ఎస్ నుంచి టికెట్ బీసీకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. టికెట్ ఆశించడంలో కూడా తన గళం గట్టిగా వినిపించారు. మంత్రి జగదీష్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పార్టీ మీటింగులకు పిలువడం లేదంటూ పార్టీ నాయకులు, కార్యకర్తల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read : రాజగోపాల్ రెడ్డి రాజీనామా, ఆమోదం! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్