తాలిబాన్ ఉగ్రవాదుల దాడులతో ఆఫ్ఘనిస్తాన్ అట్టుడుకుతోంది. రాజధాని కాబుల్ కు చేరువలోని ప్రాంతాలను కైవసం చేసుకునేందుకు తాలిబాన్ లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఘజిని నగరంపై ఆధిపత్యం కోసం ఆఫ్ఘన్ సైన్యాన్ని తాలిబాన్ లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. రెండు రోజులుగా టెర్రరిస్ట్ మూకలు రేయింబవళ్ళు చేస్తున్న దాడులతో భయానక వాతావరణం నెలకొంది.

ఆఫ్ఘన్ లో సుమారు 65 శాతం భూభాగం చేజిక్కించుకున్న తాలిబాన్ లు రాజధాని కాబుల్ కైవసం చేసుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా కాబుల్ కు 150 కిలోమీటర్ల దూరంలోని ఘజిని నగరంపై కన్నేశారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఘజిని మీద పట్టు కోసం రెండు వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. నగరంలోని పోలీసు ప్రధాన స్థావరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రేపటికల్లా ఘజిని నగరం పూర్తిగా తాలిబాన్ కంట్రోల్ లోకి వెళ్తుంది.

అమెరికా నిఘావర్గాల అంచనా ప్రకారం మరో 30 రోజుల్లో కాబుల్ మినహా దేశంలోని ముఖ్య నగరాలన్నీ తాలిబాన్ వశమవుతాయి. మూడు నెలల్లో కాబుల్ కూడా తాలిబాన్ మూకల ఆధీనంలోకి వెళ్తుంది. తాలిబాన్ కబ్జాలో ఉన్న నగరాల్లో పెద్ద సంఖ్యలో ఖైదీల్ని విడుదల చేస్తున్నారు. ఆఫ్ఘన్ సైన్యం చాల చోట్ల ఉగ్రవాదులను తలపడలేక వారికి లొంగిపోతున్నారు. వ్యాపారాలు కొనసాగాలంటే ఉగ్రవాదుల అనుమతులు తప్పని సరి. దీంతో అంతర్జాతీయ సంస్థలు కొన్ని తాలిబాన్ లతో ఒప్పందాలు చేసుకునే పనిలో ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా చైనా సంస్థలు ఉండటం గమనార్హం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *