Saturday, July 27, 2024
HomeTrending Newsబోధన ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ పరీక్షలు

బోధన ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ పరీక్షలు

Organ Transplant Surgeries : తెలంగాణలోని బోధన ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చూసి, జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. నిమ్స్, ఎం ఎన్ జే ఆసుపత్రుల పని తీరుపై నెలవారీ సమీక్ష జరిపిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు… జిల్లాల్లో ప్రమాద వశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరపక పోవడం వల్ల, ఆ పేషంట్ అవయవాలు ప్రాణ దానానికి అవకాశం లేకుండా పోతున్నాయన్నారు.

ఒక వేళ జిల్లాలోనీ టీచింగ్ ఆసుపత్రుల్లోనే బ్రెయిన్ డెడ్ నిర్ధారించగలిగితే, అవయవాలు సేకరించి, అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్స జరిపి మార్పిడి ద్వారా ప్రాణం కాపాడటం సాధ్యం అవుతుంది. దీనిపై సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, టివీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ లు అధ్యయనం చేయాలి, త్వరలో జిల్లాల్లో బ్రెయిన్ డెడ్ నిర్దారణ పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. సాధారణంగా బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ నుండి కార్నియా, గుండె, కాలేయం, లంగ్స్, కిడ్నీలు సేకరించి, జీవన్ దాన్ లో రిజిస్టర్ అయి ఏళ్ల కాలం నుండి ఎదురు చూస్తున్న వారికి అవయవ మార్పిడి చేసి ప్రాణం కాపాడవచ్చు. ఒక్కరి నుండి సేకరించిన అవయవాలు 5 గురి ప్రాణాలు నిలబెడతాయి.

ఈ ఏడాది ఇప్పటి వరకు నిమ్స్ లో 70 అవయవ మార్పిడులు జరిగాయి. గత ఏడాది వంద జరిగాయి.ఈ ఏడాది కూడా వందకు పైగా అవయవ మార్పిడి జరిగేలా పని చేయాలని కోరుతున్నాను. నిమ్స్, ఎం.ఎన్. జే హస్పిటల్స్ కు మన రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో నమ్మకంతో ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. వారికి మంచి వైద్యం అందించి విశ్వాసం పొందాలి. నిమ్స్ లో పరీక్ష ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలి. అత్యవసర విభాగంలో ఉన్న పేషెంట్లను స్టెబిలైజ్ చేసి వెను వెంటనే అయా విభాగాలకు పంపాలి. కొత్తగా వచ్చే పేషెంట్ల కోసం పడకలు అందుబాటులో ఉంచాలి. హస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆర్.ఎం.వోలు చొరవ చూపాలి. వీరు అన్ని వేళలా పేషెంట్లకు అందుబాటులో ఉండాలి.

నిమ్స్ బెడ్ ఆక్యుపెన్స్ 77 శాతం ఉంది. ఇది చాలా తక్కువ. ఒక పక్క బెడ్స్ లేవని అంటూనే, ఇక్కడ 27 శాతం బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు రిపోర్టులో ఎలా పేర్కొన్నారు. బెడ్ ఆకూపెన్సి పెంచాలి. వంద శాతం పెరగాలి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 83 డయాలసిస్ సెంటర్లో పనితీరును నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నెఫ్రాలజీ విభాగం పర్యవేక్షించి మంచి సేవలు అందించేలా చూడాలి. ఎం ఎన్ జే అధ్వర్యంలో నడుస్తున్న మొబైల్ స్క్రీనింగ్ క్యాంప్స్ జిల్లాల్లో ఎక్కువగా జరగాలి. క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో క్యాంప్ లు పెట్టాలి, వారానికి 3 క్యాంపులు నిర్వహించి క్యాన్సర్ వ్యాధి గ్రస్థులను గుర్తించి చికిత్స అందించాలి.

ఇటీవల ప్రారంబించిన మాడ్యులర్ ఆపరేషన్ ధియోటర్లు పూర్తిగా వినియోగించాలి. అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలి. 300 పడకల కొత్త బ్లాక్ పనులు దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో ఫర్నీచర్, ఎక్విప్మెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎం ఎన్ జే లో ఏర్పాటు చేసిన పిడియాట్రిక్ పాలియేటివ్ విషయంలో మనం దేశానికే ఆదర్శంగా ఉన్నాం. అడల్ట్ పాలియేటివ్ కేర్ విభాగంలో మరో 50 పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో 33 పాలియేటివ్ కేర్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా అవసాన దశలో ఉన్నవారికి మెరుగైన సేవలు అందించాలి. ఈ విషయంలో ఉత్తమ సేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నూతన విధానం రూపొందించాలి.

వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాల సహకారం అందిస్తున్నారు కాబట్టి అందరం బాగా కృషిచేసి ప్రజలకు మంచి వైద్య సేవలు అందిద్దాం అని కోరుతున్నా. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి, కమిషనర్ శ్వేతా మహంతి, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, నిమ్స్, ఎం ఎన్ జే డైరెక్టర్లు, అన్ని విభాగాల హెచ్ వో డీలు పాల్గొన్నారు.

Also Read : హైదరాబాద్లో నర్సరీ మేళా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్