Friday, April 19, 2024
HomeTrending NewsBonalu: బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

Bonalu: బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే ఆషాడ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం బేగంపేట లోని హరిత ప్లాజా లో జూన్ 22 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, DGP అంజనీ కుమార్, MLC లు ప్రభాకర్ రావు, సురబి వాణిదేవి, MLA లు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, అరికేపూడి గాంధీ, ట్రాన్స్ కో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జూన్ 22 నుండి ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. 22 న గోల్కొండ లో బోనాలు ప్రారంభం అవుతాయని, జులై 9 న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16 వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని వివరించారు.

బోనాల ఉత్సవాల సందర్బంగా గోల్కొండ లోని శ్రీ జగదాంబిక ఆలయంలో, సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి, ఓల్డ్ సిటీ లోని శ్రీ అక్కన్న మాదన్న తదితర 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఉజ్జయిని మహంకాళి, అక్కన్న మాదన్న, సబ్జిమండి ఆలయాలకు అంబారీ ఊరేగింపు కోసం ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పలు ప్రముఖ ఆలయాల వద్ద భక్తుల ఆహ్లాదం కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లతో బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందని, నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వాలు బోనాల పండుగ సరిగా జరపలేదని, తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని అన్నారు. ఈ సంవత్సరం కూడా ఏర్పాట్ల కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో వాటర్ వర్క్స్ MD దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ లు CV ఆనంద్, చౌహాన్, వివిధ శాఖల కు చెందిన అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్