ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెరుగుతాయనుకున్న చమురు మంటలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఒకే రోజు పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన పన్నెండు రోజుల తర్వాత ఈ రోజు (మంగళవారం) పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగాయి. ఎల్.పి.జి సిలిండర్ మీద ఏకంగా 50 రూపాయలు పెరిగింది. తాజా పెంపుతో 949.50 లకు వంట గ్యాస్ సిలిండర్ ధర చేరింది.

ముంబైలో డీజిల్ ధర లీటరుకు రూ. 94.14 నుంచి రూ. 106.62కి పెరిగి మూడు అంకెల మార్కును తాకింది. అంటే డీజిల్ లీటరు ధర లీటరుకు రూ.12 పెరిగింది. పెట్రోలు ధరలు కూడా లీటరుకు రూ.109.98 నుంచి రూ.115.85కి అనూహ్యంగా పెరిగాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ నవంబర్ 2021 నుంచి ఇంధన ధరలు మారలేదు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా  పెట్రోలు ధరలు పెరిగాయి.

ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.110.82 కాగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.95.00కు పెరిగాయి. కేవలం ఒక్క రోజులో రూ. 6 తేడాతో పెట్రోలు ధర భారీగా పెరిగింది. డీజిల్ ధర కూడా లీటరుకు 5 రూపాయలకు పైగా పెరిగింది. తమిళనాడులోని చెన్నైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా లీటరుకు రూ.102.16, రూ.92.19కి పెరిగాయి. విలువ ఆధారిత పన్ను (వ్యాట్), సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలు,నగరాల్లో కూడా మారుతూ ఉంటాయి.

పెట్రో, డీజిల్ ధరలు పెరగటంతో నిత్యావసరాల ధరలు కూడా సాయంత్రానికి అమాంతం పెరిగే అవకాశం ఉంది. చమురు, నిత్యావసరాల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయక పోతే శ్రీలంకలో పరిస్థితులు ఇండియాలో కూడా తలెత్తే ప్రమాదం ఎంతో దూరంలో లేదు.

 

Also Read : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *