Thursday, April 25, 2024
HomeTrending Newsదేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్  : మోడీ ప్రకటన

దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్  : మోడీ ప్రకటన

దేశంలో వందశాతం వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. జూన్ 21 నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ  కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ వేస్తుందని భరోసా ఇచ్చారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ కీలక ప్రకటన చేశారు. వ్యాక్సిన్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీకాల భారాన్నుంచి రాష్ట్రాలకు విముక్తి కలిగిస్తున్నామన్నారు.

ఇప్పటి వరకూ రాష్ట్రాల వద్ద ఉన్న 25  శాతం వ్యాక్సిన్  బాధ్యతను కూడా కేంద్రమే తీసుకుంటుందని మోడీ వెల్లడించారు.  అన్ని వర్గాల వారికీ ఉచితంగానే ఇస్తామని,  ఉచిత టీకా వద్దనుకుంటే ప్రైవేటుగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలియజేశారు,  వ్యాక్సిన్ ఉత్పత్తి దారుల నుంచి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని ప్రకటించారు.  వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 75 శాతం కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుందని, మిగిలిన 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.  ప్రైవేటు ఆస్పత్రులు 150 రూపాయలు సర్వీస్ చార్జ్ తీసుకోవాలని సూచించారు. టీకా తీసుకున్నా కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని మోడీ చెప్పారు.  నవంబర్ నాటికి 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

కరోనా రెండో వేవ్ తో చారిత్రాత్మక పోరాటం చేస్తున్నామన్నారు. గడచినా వందేళ్ళలో ప్రపంచం ఇలాంటి మహమ్మారిని చూడలేదని పేర్కొన్నారు. కరోనా వల్ల దేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారని, ఆప్తులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  గత సంవత్సర కాలంగా కోవిడ్ తో పోరాడుతూనే పటిష్టమైన వైద్య వ్యవస్థను తయారు చేసుకున్నామని వివరించారు.  ఇప్పటికే 23 కోట్ల మందికి వ్యాక్సిన్ పూర్తి చేశామని తెలిపారు.

మనం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకోబట్టి సరిపోయిందని, లేకపోతే విదేశీ సంస్థలు వాళ్ళ అవసరాలు తీరాకే మనకు ఇచ్చేవారని మోడీ అభిప్రాయపడ్డారు.  ఇంత జనాభా ఉన్న  భారత దేశం  కరోనాను కరోనా ను ఎలా తట్టుకుంటుందో, వ్యాక్సిన్ ఎలా వేస్తుందో అని ప్రపంచమంతా ఆసక్తిగా చూసిందన్నారు. స్వదేశీ సంస్థల తీకాతో ప్రపంచానికి  మన సత్తా చాటామన్నారు.  వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు అన్నిరకాల సహకారం అందించామన్నారు . దేశంలో ప్రస్తుతం ఆరు కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయని వివరించారు.  ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ పై పరిశోధనలు జరుగుతున్నాయి, త్వరలోనే ఇది కూడా అందుబాటులోకి వస్తుందన్నారు.

 

అర్హులైన ప్రతి ఒక్కరికీ దీపావళి వరకూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్