Sunday, May 19, 2024
HomeTrending Newsకొత్త మత్స్య పారిశ్రామిక సోసైటీలకు సన్నాహాలు

కొత్త మత్స్య పారిశ్రామిక సోసైటీలకు సన్నాహాలు

New Fisheries Societies : ఎన్నో ఏళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని,నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికుల నుంచి డిమాండ్ ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అయితే ఏ ప్రభుత్వం వారి డిమాండ్ పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల సంస్థలో మత్స్య శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రతీ చెరువు కాళేశ్వరం నీటితో కళకళలాడుతోంది. చెక్ డ్యాంలు పెద్ద ఎత్తున జిల్లాలో నిర్మించామన్నారు. దీని వల్ల నీటి వనరులు పెరిగాయి. వీటిలో చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. కొత్తగా పెరిగిన నీటి వనరుల వల్ల ఆయా గ్రామాల్లో చేపల పెంపకం చేపట్టవచ్చు. ఇలాంటి నీటి వనరులు ఉన్న చోట కొత్త మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు.

నీటి వనరులు లేనప్పుడు రెండున్నర ఎకరాలకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయడం జరిగింది. కాని ఇప్పుడు నీటి వనరులు పెరగడంతో ఎకరం నీటి వనరుకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీష్ రావు వెల్లడించారు. ఈ లెక్కన కొత్తగా సొసైటీలు ఏర్పాటు ఏర్పాటు చేయడంతో పాటు, పాత సోసైటీల్లోను ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉంది. దీని వల్ల పాత సొసైటీల్లోను కొత్తగా సభ్యులను ఎంపిక చేయవచ్చన్నారు. సిద్దిపేట జిల్లాలో 281 సోసైటీలు ఉండగా అందులో 20731 మందికి సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఈ సొసైటీలు జిల్లాలోని 1255 నీటివనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 381 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

మెదక్ జిల్లాలో 263 సొసైటీల్లో 15724 మంది సభ్యులు ఉన్నారు. ఈ సొసైటీలు జిల్లాలోని 1379 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 235 నీటి వనరులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దాదాపు సంగారెడ్డి జిల్లాలో 193 సొసైటీల్లో 10434 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాలు 875 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 196 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా నీటి వనరులు ఎలా ఉన్నాయో లెక్క తెల్చాలని ఫిషరీస్ శాఖకు మంత్రి హరీశ్ రావు ఆదేశం. ఏ చెరువు వర్షం మీద ఆదారపడి ఉంది, ఏ చెరువుకు కాలువల నీరు చేరుతుందన్న సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఏ సోసైటీ లో ఎందరు సభ్యులు ఉన్నారు. కొత్తగా ఎంత మంది చేర్చుకోవచ్చు అన్న సమాచారం పక్కాగా సేకరించాలని అధికారులకు సూచించారు.

కొత్త సభ్యత్వం చేపట్టడం, కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్య కార్మికులకు ఉపయోగాలున్నాయని, సొసైటీలో సభ్యులు ఎక్కువ మంది ఉంటే బీమా సౌకర్యం కలుగుతుంది. రుణ సౌకర్యం సుళువుగా జరుగుతుంది. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందరికీ వర్తిస్తాయని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు బండా ప్రకాశ్, బీబీ పాఠిల్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, మదన్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, పారూఖ్ హుస్సెన్, భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఫిషరీష్ శాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Also Read : మత్స్యకార సొసైటీల్లో తెలంగాణ టాప్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్