Saturday, March 14, 2026
HomeTrending Newsఒమిక్రాన్‌ వేరియంట్‌ పై ప్రధానమంత్రి సమీక్ష

ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై ప్రధానమంత్రి సమీక్ష

Prime Ministers Review On The Omicron Variant :

ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న వేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో… భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ రోజు(శనివారం) కీలక సమావేశం నిర్వహించారు. దేశంలో కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించడానికి ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, నీతిఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని సూచించిన ప్రధానమంత్రి జిల్లా స్థాయిలో కొత్త వేరియంట్ పై ప్రజల్ని చైతన్యం చేసే కార్యాక్రమాలు చేపట్టి,అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. అనుమానిత దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేసి, అవసరమైన వారిని క్వారంటైన్ పంపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఓమిక్రాన్ వ్యాప్తి కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో, యూరోప్. అమెరికాతో పాటు పలు దేశాలు మళ్లీ ఆంక్షల బాట పట్టిన వేళ.. ప్రధాని భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వాన, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, ఇజ్రాయల్, హాంకాంగ్, బ్రిటన్ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. మరోవైపు గుజరాత్, కర్నాటక తదితర రాష్ట్రాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ వున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు చేయించుకోవాలని నిబంధన పెట్టాయి.

Also Read : జర్మనీ, రష్యాల్లో కరోనా కల్లోలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular