Monday, June 15, 2026
HomeTrending Newsటెక్స్‌టైల్‌ రంగ అభివృద్దికి రోడ్ మ్యాప్

టెక్స్‌టైల్‌ రంగ అభివృద్దికి రోడ్ మ్యాప్

తెలంగాణ రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకు రానున్న భవిష్యత్తుకు దానికి అవసరమైన రోడ్డు మ్యాప్ నివేదికను తయారు చేయాలని టెక్స్టైల్ శాఖ అధికారులకు మంత్రి కే. తారకరామారావు ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తుందన్న మంత్రి, ఈ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపైన సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. గత ఏడున్నర సంవత్సరాలుగా తెలంగాణ టెక్స్టైల్ రంగంలోని నేతన్నల సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటి సత్ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.

ఈ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా, నేతన్నల సంక్షేమమే పరమావధిగా అనేక వినూత్నమైన కార్యక్రమాలను తీసుకువచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేవలం నేతన్నలకు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా, దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి ఇస్తున్న టెక్స్టైల్ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగముగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, ఈ రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిందని కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలయిన యంగ్ వన్, దేశీయ టెక్స్టైల్ దిగ్గజమైన కిటెక్స్ వంటి అనేక కంపెనీలు తెలంగాణలో ఉన్న అవకాశాలను, ఇక్కడి మానవ వనరులను, ప్రభుత్వ పాలసీలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.

అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న టెక్స్టైల్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే చేపట్టాల్సిన మౌలిక వసతులు, నూతన పాలసీలు, నేతన్నల కోసం చెప్పట్టల్సిన సంక్షేమ కార్యక్రమాలు, టెక్స్టైల్ మరియు టెక్స్టైల్ అనుబంధ రంగాల్లో తీసుకురావాల్సిన మరిన్ని కార్యక్రమాల వంటి అన్నింటిని ఈ నివేదికలో పొందుపరచాలని సూచించారు. దీంతో పాటు ఈరోజు టెక్స్టైల్ శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పాటు బడ్జెట్లో పొందుపర్చాల్సిన కార్యక్రమాలు, పథకాలు, ఇతర అంశాల పైన మంత్రి కేటీఆర్ టెక్స్టైల్ శాఖ ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఈ సమావేశంలో టెక్స్టైల్ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టిఎస్ఐఐసి ఎండి వెంకట నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఢిల్లీ చేరిన ఉక్రెయిన్ తెలుగు విద్యార్ధులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular