Wednesday, March 11, 2026
HomeTrending Newsరాహుల్ గాంధిని కలిసిన రాజస్థాన్ పైలట్

రాహుల్ గాంధిని కలిసిన రాజస్థాన్ పైలట్

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవం మరువకముందే మరో చిక్కు మొదలైంది. రాజస్తాన్ లో పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మళ్ళీ తెరమీదకు వచ్చారు. పైలట్ కు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన వర్గంలో కొందరు నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినా… సచిన్ పైలట్ స్థానం ఏంటో తేలలేదు. దీంతో ఆ వర్గం తమకు న్యాయం చేయాలని కొన్నాళ్ళుగా డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా సచిన్ పైలట్ నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఢిల్లీలో సమావేశం అయ్యారు.

సుమారు గంటపాటు జరిగిన సమావేశంలో పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, సంస్థాగతమైన అంశాలపై నేతలు చర్చించారు. ఐదు రాష్ట్రాల ఓటమితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పార్టీలో సంస్కరణలు చేపట్టాలని తీర్మానం చేసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రంలో ఏడాది ముందుగానే మార్పులు చేయాలని, ఎన్నికల సమయంలో నేతలను మార్చటం పార్టీకి నష్టం చేకుర్చుతోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అభిప్రాయపడింది.

2020 జూలై లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసి హర్యానాలో రెబల్ ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించారు. అప్పుడు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని సచిన్ ఇబ్బందులు  పరిష్కరిస్తామని అందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ నాయకత్వంలో కమిటీ వేసింది. రెండేళ్ళు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని సచిన్ వర్గం నేతలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నిలు ఉన్న దృష్ట్యా సచిన్ వర్గం నేతలు అధిష్టానం మీద ఒత్తిడి తీవ్రతరం చేశారు.

రాహుల్ గాంధి మిత్రబృందంగా పేరున్న నేతలు జ్యోదిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద కమలం గూటికి చేరటం పార్టీకి నష్టం చేకూర్చింది. మధ్యప్రదేశ్లో కమల్ నాథ్ కుట్రలతో సింధియా, ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకగాంధి వైఖరితో జితిన్ పార్టీని వీడారనేది బహిరంగ రహస్యమే. సచిన్ విషయంలో తొందరపడక పోతే కాంగ్రెస్ అధిష్టానానికి మరోసారి భంగపాటు తప్పదు.

Also Read : కాంగ్రెస్ ఓటమిలో బి జె పి గెలుపు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular