Friday, September 20, 2024
HomeTrending Newsఇంగిత జ్ఞానం లేకుండా బాబు ఆరోపణలు: సజ్జల ఫైర్

ఇంగిత జ్ఞానం లేకుండా బాబు ఆరోపణలు: సజ్జల ఫైర్

విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంలో టిడిపి, బిజెపి నేతల పాత్ర ఉందని  వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సదరు కంపెనీతో పురందేశ్వరి బంధువులకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మీడియాపై ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా కు ఫిర్యాదు చేస్తామని, టిడిపి సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.  బిజెపి, టిడిపి నేతలు ఈ కేసునుంచి తప్పించుకోవడానికే తమపై నిందలు మోపుతున్నారని విమర్శించారు.  ప్రజలు మరోసారి తెలుగుదేశం పార్టీని గెలిపించే అవకాశమే లేదని అందుకే వారు ఇలాంటి దుష్ప్రచారానికి తెరతీస్తున్నారని సజ్జల అభ్యంతరం వెలిబుచ్చారు.

టిడిపి రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పాలించి.. వారు చేసిన మంచి ఏమిటో చెప్పుకోవడానికి ఏమీ లేక తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్నారు.  రాష్ట్రంలో డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేయడానికి ఐదేళ్లుగా సిఎం జగన్ ఎన్నో చర్యలు తీసుకున్నారని, స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు  కూడా టిడిపికి రావని, అందుకే ఓటమికి కారణాలు వెతుక్కోవడం కోసమే ఓ గ్రౌండ్ తయారు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో దోషులను వెంటనే బైటపెట్టాలని, నిష్పాక్షక విచారణ జరిపి దీనిపై ఎవరున్నారో తేల్చాలని సజ్జల డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం, సిబిఐ తో పాటు ఇతర విచారణ సంస్థలకు కూడా దీనిపై ఫిర్యాదు చేస్తామన్నారు. సిబిఐ విచారణకు వైసీపీ నేతలు, రాష్ట్రానికి చెందిన అధికారులు ఆడ్డుపడ్డారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏవైనా ఆధారాలుంటే బైట పెట్టాలి కానీ ఏవో ఊహించి రాయడం. చంద్రబాబు ట్వీట్లు చేయడం హేయమని అన్నారు. టిడిపిలో సామాన్య కార్యకర్తలు ఎవరైనా ఆరోపణలు చేస్తే  తెలియక చేశారని అనుకోవచ్చని, కానీ ఓ మాజీ సిఎం చంద్రబాబు, భవిష్యత్తులో సిఎం కావాలనుకుంటున్న లోకేష్ లు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ట్వీట్లు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్