Wednesday, July 3, 2024
HomeTrending NewsPakistan-1: ఉగ్రవాదుల వరుస హత్యలు... పాక్ రాజకీయాలు

Pakistan-1: ఉగ్రవాదుల వరుస హత్యలు… పాక్ రాజకీయాలు

భారత్ లో అలజడి సృష్టించే వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థల నాయకులు అనేకమంది పాకిస్తాన్ లో ఇటీవల హతం అవుతున్నారు. ఏడాది నుంచి కరడుగట్టిన ఉగ్రవాద నేతలను పాయింట్ బ్లాంక్ లో కాల్చటం, సమీపంలో బాంబు పేలుళ్లకు పాల్పడటం అనేక అనుమానాలకు తావు ఇస్తోంది. ఇంత జరుగుతుంటే ప్రజల నుంచి కూడా ఆందోళన వ్యక్తం కావటం లేదు.

భారత్ ప్రత్యర్థులను పాకిస్థాన్‌లో వెంటాడుతోందెవరు..? మన దేశానికి అన్యాయం చేసిన వారిని టార్గెట్ చేసి మరీ ఎవరు హత్య చేస్తున్నారు. భారత్ హిట్ లిస్టులో ఉన్న టెర్రరిస్టులు ఒక్కొక్కరిగా హత్యకావడం వెనక ఎవరి హస్తముంది..? దావూద్‌పై విషప్రయోగం, మసూద్ అజహర్ మృతి వార్తలతో పాకిస్థాన్‌లో వరుస హత్యలపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది.

ఏడాదిగా పాకిస్థాన్‌కు చెందిన భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు వరుసగా హత్యలకు గురవుతున్నారు. ఇది మిస్టరీగా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై రావడం.. టార్గెట్ చేసిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించడం.. ఈ హత్యలన్నింటిలోనూ కామన్‌గా కనిపిస్తోంది. పాకిస్థాన్ భద్రతాదళాలు ఈ హత్యలకు పాల్పడినవారిని గుర్తించడం కానీ అరెస్టు చేయడం కానీ ఇప్పటిదాకా జరగలేదు. నేపాల్‌లో జరిగిన ఓ ISI ఏజెంట్ హత్యలో మాత్రం ముగ్గురిని అరెస్టు చేశారు.

రావల్పిండిలో అలమ్‌ హ‌తం
ఫిబ్రవరిలో ఈ హత్యల పరంపరం మొదలయింది. హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ అలమ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. రావల్పిండిలోని ఓ షాపు దగ్గర పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పీర్‌పై కాల్పులు జరిపారు. రెండు వారాల తర్వాత జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా బబాపొరా గ్రామంలో పీర్ ఆస్తులను NIA అటాచ్ చేసింది. పాకిస్థాన్‌లో హిజ్బుల్ లాంచింగ్ చీఫ్‌గా ఉన్న పీర్.. జమ్ముకశ్మీర్‌లోకి పేలుడుపదార్థాలు, ఆయుధాలు అక్రమంగా తరలించేవాడు. గత ఏడాది అక్టోబరులో భారత్ అతన్ని ఉగ్రవాదగా ప్రకటించింది.

ఇంటి దగ్గరే ఖలీద్ ఖ‌తం
పీర్ హత్య జరిగిన ఆరురోజుల తర్వాత విద్యావేత్త సయ్యద్ ఖలీద్ రజాను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థ అల్-బద్ర్ మాజీ కమాండర్ ఖలీద్. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు రజా తలపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. ఇంటి దగ్గర.. పార్క్ చేసి ఉన్న కారు దగ్గరకు వెళ్తుండగా రజాపై కాల్పులు జరిగాయి. సింథి టెర్రరిస్ట్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది.

జహీద్ అక్‌హండ్ పేరుతో నివస్తున్న జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీమ్ మార్చి 1న హత్యకు గురయ్యాడు. కరాచీలో అతని హత్య జరిగింది. 1999లో కాందహార్ విమానం హైజాక్ చేసిన ఐదుగురిలో మిస్త్రీ ఒకడు. హనీమున్ ముగించుకుని భారత్ తిరిగి వస్తున్న రూపిన్ కత్యాల్‌ను కత్తితో పొడిచి చంపింది మిస్త్రీనే.

మార్చిలో సయ్యద్ నూర్ షాలోబర్ హత్య
ఈ ఏడాది మార్చిలోనే ఖైబుర్ పంఖ్తుఖ్వా రీజియన్‌లో సయ్యద్ నూర్ షాలోబర్ హత్య జరిగింది. షాలోబర్ పాకిస్థాన్ ఆర్మీ, ISIతో కలిసి కశ్మీర్‌లో ఉగ్రదాడులు కోసం ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకునేవాడు. ఖలిస్థాన్ కమాండ్ ఫోర్స్ చీఫ్‌గా ఉన్న పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్‌ కూడా ఈ మార్చిలో లాహోర్‌లోని తన ఇంటి దగ్గర హత్యకు గురయ్యాడు. ముంబై అల్లర్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు సర్దార్ హుస్సేన్ అరైన్ సింధ్‌లో ఆగస్టు 1న హత్యకు గురయ్యాడు. జనవరిలో రాజౌరి జిల్లాలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకరైన అబు ఖాజిమ్ కశ్మీరీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మసీదులో ప్రార్థనలు చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

నేపాల్‌లో లాల్ మహ్మద్ ఖ‌తం
ISI ఏజెంట్‌ గా భావించే లాల్ మహ్మద్ అలియాస్ మహ్మద్ దర్జీ నేపాల్ రాజధాని ఖాట్మండులో సెప్టెంబరు 19న హత్యకు గురయ్యాడు. లష్కరే తోయిబా సభ్యుడు మౌలానా జిహార్ రెహ్మాన్ ఇలాగే హత్యకు గురయ్యాడు. జైషే మహ్మద్ ఉగ్రవాది షహీద్ లతీఫ్, మౌలానా మజూద్ అజ్‌హర్ సన్నిహితుడు దావూద్ మాలిక్, ఖ్వాజా షాహిద్, అక్రమ్ ఖాన్ ఘాజీ, మౌలానా రహీమ్ ఉల్లాహ్ తరీఖ్ వంటివారంతా ఇలాగే హత్యకు గురయ్యారు.

పాకిస్థాన్లోని మాముండ్ ఏరియాలో బాజోరు ప్రాంతంలో జేషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నాయకుడు యూనస్ ఖాన్ హతమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి అతడిని అంతమొందించారు. భార‌త్ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసిన ల‌ష్క‌రే తోయిబా మాజీ క‌మాండ‌ర్ అక్రం ఘ‌జిగా పేరొందిన అక్రం ఖాన్‌ను పాకిస్తాన్ లోని బ‌జౌర్ జిల్లాలో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు హ‌త‌మార్చారు. భారత్ హిట్ లిస్ట్‌లో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు వారం వ్యవధిలోనే హతమవడం గమనార్హం. సుంజ్వాన్ ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరైన ఖ్వాజా షాహిద్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. నియంత్రణ రేఖకు సమీపంలో పీఓకే వద్ద శిరచ్ఛేదం చేశారు.

అక్రమ్ ఖాన్ అలియాస్ ఘాజీ 2018-2020 మధ్యకాలంలో లష్కరే రిక్రూటర్లలో కీలకంగా ఉన్నాడు.  గత రెండేళ్లలో కశ్మీర్ లోయలోకి అనేక బ్యాచ్‌లుగా చొరబడిన చాలా మందిని ఉగ్రవాదులుగా మార్చడంలో బాధ్యత వహించాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2018 నుంచి 2020 వ‌ర‌కూ ల‌ష్క‌రే రిక్రూట్‌మెంట్ విభాగానికి నేతృత్వం వ‌హించిన అక్రం ఖాన్ పాకిస్తాన్‌లో భార‌త్ వ్య‌తిరేక ప్ర‌సంగాల‌తో పేరొందాడు.
సెప్టెంబరులో పీఓకేలోని రావాలకోట్‌లోని అల్ ఖుద్దూస్ మసీదు వెలుపల లష్కరే కమాండర్ రియాజ్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. పీఓకేలో లష్కర్ రిక్రూట్‌మెంట్‌ను బాధ్యతలను నిర్వహించే ఖుద్దూస్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

ఈ ఘటన వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ హత్యను గుర్తుచేస్తుంది. అతడు గత మేలో లాహోర్‌లోని తన నివాసానికి సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఉగ్రవాదుల వరుస హత్యలు పాక్‌ను కలవరానికి గురిచేస్తున్నాయి.  కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో మౌలానా జియావుర్ రెహ్మాన్, గుల్షన్-ఇ-ఉమర్ సెమినరీలో ముఫ్తీ ఖైజర్ ఫరూక్ అనే ఇద్దరు లష్కరే కార్యకర్తలు హత్యకు గురయ్యారు.

పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి సూత్రధారి, జైషే మొహమ్మద్ ఉగ్రవాది షాహిద్ లతీప్‌‌ను అక్టోబరు 10న పాక్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గత 20 నెలల్లో భారత్‌పై కుట్రలు చేసిన 18 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో మృతి చెందడం గమనార్హం.

పాక్‌లోని భవల్‌పూర్‌లో ఉదయం 5 గంటల సమయంలో మసీదు నుంచి మసూద్‌ తిరిగి వస్తుండగా దాడికి గురి అయినట్టు వార్తలు వస్తున్నాయి. మసూద్‌పై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటన స్థలంలోనే అతడు మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు ట్రెండ్‌ అవుతున్నాయి. అయితే మసూద్ అజహర్ మరణ వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే మసూద్‌పై బాంబు దాడి జరిగినట్లుగా పేర్కొంటూ వైరల్‌ అవుతున్న వీడియో పాత వీడియో అని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి మసూద్‌ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు పాక్‌స్థాన్‌లో నివాసం ఉంటున్నాడని అనుమానాలున్నాయి. అయితే మసూద్ అజహర్ తమ దేశంలో నివాసం ఉండటం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అతడిపై దాడి జరిగినా దాని గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం లేదు. అంతకు ముందు మాఫియా డాన్  దావూద్‌పై విషప్రయోగం వార్తలతో మరోసారి ఈ హత్యలపై చర్చ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్