Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఆడపిల్లల్ని, స్త్రీలను వేధించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అటువంటి వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డి. ఎస్. చౌహాన్ ఐ. పి.ఎస్. తెలిపారు. షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో కమిషనర్ డిఎస్. చౌహాన్ గారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటోందని, ఆకతాయిలు, గృహహింస, పని ప్రదేశాల్లో వేధింపుల వంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. రాచకొండ పోలిస్ కమిషనరేట్ పరిధిలో ఆడపిల్లల భద్రత కోసం పోలీసులు షి టీమ్ ల ద్వారా ఎన్నో కార్య్రమాలను నిర్వహిస్తున్నారని, ఆకతాయిలకు కౌన్సిలింగ్ ద్వారా వారి చెడు ప్రవర్తనను మార్చుకోవడానికి, తిరిగి బాధ్యత గల పౌరులుగా మారే అవకాశం కల్పిస్తున్నారు .

ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
షి టీమ్స్ వారు గడిచిన రెండు నెలల కాలంలో ఈవ్ టీజర్ల మీద 118 కేసులు నమోదు చేశారు. వాటిలో 33 FIR, 41 పెట్టీ కేసులు మరియు 44 కౌన్సెలింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 247 మంది ఆకతాయిలను అరెస్టు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిసిపి రోడ్ సేఫ్టీ శ్రీ బాల, డిసిపి ట్రాఫిక్, శ్రీనివాస్, ఎల్.బి. నగర్ డిసిపి సాయి శ్రీ, ఎల్.బి. నగర్ ఏసిపి శ్రీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com