Friday, April 19, 2024
HomeTrending Newsప్ర‌గ‌తి భ‌వ‌న్‌ బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే కాంగ్రెస్ విధానామా - కేటీఆర్

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే కాంగ్రెస్ విధానామా – కేటీఆర్

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ధ‌ర‌ణి ర‌ద్దు చేయ‌డం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ బ‌ద్ద‌లు కొట్టడం, బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా? అని కేటీఆర్ కాంగ్రెస్ స‌భ్యుల‌ను సూటిగా ప్ర‌శ్నించారు. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. గ‌త ఆరేండ్ల‌లో 30 ల‌క్ష‌ల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయితే, ఈ ఏడాదిన్న‌ర కాలంలోనే 23 ల‌క్ష‌ల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేష‌న్ అయ్యాయి. అన్నిస‌వ్యంగా జ‌రిగితే ఎవ‌రూ మాట్లాడ‌రు. ఎక్క‌దో ఒక చిన్న లోపం జ‌రిగితే భూత‌ద్దంలో పెట్టి చూపిస్తున్నారు. ఒక‌ట్రెండు లోపాలు జ‌రిగితే రాష్ట్ర‌మంతా గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని చెప్ప‌డం స‌రికాద‌న్నారు. ధ‌ర‌ణిని ర‌ద్దు చేస్తామ‌ని పార్టీ అధ్య‌క్షుడు చెప్తున్నాడు. ధ‌ర‌ణిని ర‌ద్దు చేయ‌డం పార్టీ విధాన‌మే అయితే.. పార్టీ ప‌రంగా చెప్పండి. ధ‌ర‌ణి వ‌ల్ల రైతుల‌కు ఏ లాభం లేదు.. ర‌ద్దు చేస్తామ‌ని చెప్పండి. కాంగ్రెస్ హ‌యాంలో లంచం లేకుండా రిజిస్ట్రేష‌న్లు, మ్యుటేష‌న్లు చేయ‌కుండా రైతుల‌ను రాక్ష‌సంగా ఇబ్బంది పెట్టిన‌ట్లే ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాల‌ని చూస్తున్నాం అని శ్రీధ‌ర్ బాబు చెప్ప‌ద‌లుచుకున్నారా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. రైతుల‌ను పీడించ‌డం, వారి ప‌ట్ల క‌ర్కశకంగా వ్య‌వ‌హ‌రించ‌డమే మా విధానం అని ఆయ‌న చెప్ప‌ద‌లుచుకున్నారా..? రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో లంచ‌గొండిత‌నం ఉండాల‌నేది వారి విధానం అయితే చెప్ప‌మ‌నండి. ఆధారాలు లేకుండా నిందారోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు. శాస‌న‌స‌భ‌ను, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా మాట్లాడొద్ద‌ని కేటీఆర్ సూచించారు.

వాళ్ల అధ్య‌క్షుడేమో ధ‌ర‌ణి ర‌ద్దు చేస్తా అని ప్ర‌క‌ట‌న‌లు చేస్తాడు. మా అధ్య‌క్షుడు అలా మాట్లాడ‌లేద‌ని శ్రీధ‌ర్ బాబు చెబుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అరాచ‌కం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎన్నిక‌ల్లో వారికి డిపాజిట్లు కూడా రావ‌డం లేదు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను పేల్చేయాల‌ని వారి అధ్య‌క్షుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఆ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ ఇక్క‌డ వారి స‌భ్యురాలు మాట్లాడుతారు. అస‌లు కాంగ్రెస్ పార్టీకి ఒక వైఖ‌రి అంటూ ఉందా? లేదా స్ప‌ష్టం చేయాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధ్య‌క్షుడికి, నాయ‌కుల‌కు స‌మ‌న్వ‌యం లేక‌పోతే మాకు సంబంధం లేదు. ధ‌ర‌ణిని ఎత్తివేయ‌డం మీ ఉద్దేశ‌మా? ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం ఒక సిద్ధాంత‌మా..? ఇది కాంగ్రెస్ పార్టీ వైఖ‌రా..? ఇంత అరాచ‌కంగా, అడ్డ‌గోలుగా మాట్లాడొచ్చా..? అధ్య‌క్షుడి మాట‌ల‌ను స‌మ‌ర్థిస్తూ వారి స‌భ్యురాలు మాట్లాడొచ్చా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ నాయ‌కుల నోట్లో నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావ‌డం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డా కాకుండా పోతుంది. ఇక‌నైన వారి వైఖ‌రి మార్చుకోవాలి అని కేటీఆర్ సూచించారు.

Also Read : బడ్జెట్‌లో సకలజనుల సంక్షేమం : మంత్రి హరీశ్‌రావు

RELATED ARTICLES

Most Popular

న్యూస్