Monday, June 17, 2024
Homeస్పోర్ట్స్IPL: ఫైనల్లో హైదరాబాద్: రాజస్థాన్ పై ఘనవిజయం

IPL: ఫైనల్లో హైదరాబాద్: రాజస్థాన్ పై ఘనవిజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ 2024 ఫైనల్లో అడుగు పెట్టింది. నేడు జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 36 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచింది. బ్యాటింగ్ లో ఆశించిన స్కోరు చేయలేకపోయినా బౌలింగ్ లో రాణించి లక్ష్యాన్ని నిలబెట్టుకొని సత్తా చాటింది.  షాబాజ్ అహ్మద్ ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచాడు.. 18 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో విఫలమైన అభిషేక్ శర్మ 2 కీలక వికెట్లు పడగొట్టి విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 175 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసేన్-50 (34 బంతుల్లో 4 సిక్సర్లు); రాహుల్ త్రిపాఠి-37 (15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు); ట్రావిస్ హెడ్-34 (28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్).. షాబాజ్ అహ్మద్-18; అభిషేక్ శర్మ-12 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ చెరో 3 వికెట్లు; సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు.

రాజస్థాన్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ (కోహ్లేర్-10) కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి రెండో వికెట్ గా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో ధృవ్ జురెల్ ఒక్కడే 56 (35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు.

షాబాజ్ అహ్మద్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

హైదరాబాద్- కోల్ కతా మధ్య ఆదివారం ఇదే వేదికలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ ఫైనల్స్ కు చేరడం ఇది మూడోసారి. 2016లో బెంగుళూరుపై విజయం సాధించి విజేతగా నిలవగా….2018లో చెన్నై చేతిలో ఓటమి పాలై రన్నరప్ గా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్