Saturday, July 27, 2024
HomeTrending Newsబట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు

బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు

కేవలం రాజకీయాల కోసం మాట్లాడే వారికి కాకుండా ప్రజల కోసం బాధ్యతతో పనిచేసే నాయకులకే మద్దతుగా నిలవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ మండల కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి 18 అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కవిత శంకుస్థాపనలు చేశారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో భీమ్ గల్ పట్టణంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ప్రారంభించింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఏడేండ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిచిందని, దీనికి సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలే కారణమన్నారు. రాష్ట్రం కోసం ఎంత ప్రేమతో కొట్లాడినమో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ గారు అంతే చిత్తశుద్దితో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంటే, కొంత మంది రాజకీయాల కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనటం సరికాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కొందరు బీజేపీ నాయకులు కేవలం రాజకీయాల కొసం బట్టేబాజ్ మాటలు చెప్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పనిచేసే నాయకులకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్న ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్ ని రాష్ట్ర ప్రజలు రెండు సార్లు దీవించి ముఖ్యమంత్రిగా గెలిపించారని తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి  ఆధ్వర్యంలో భీమ్ గల్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత, బాల్కొండను బంగారు బాల్కొండ గా మార్చే భాద్యత మాదని ప్రకటించారు. భీంగల్ ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని, భీంగల్ పట్టణంలో త్వరలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బిజెపి ,కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. భీమ్ గల్ ను మున్సిపాలిటిగా మార్చాలని ఎమ్మెల్సీ కవిత మంత్రి కేటీఆర్ ని కోరారని, భీమ్ గల్ మున్సిపాలిటీకి రూ.25 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.

భీమ్ గల్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత ముందుగా వేల్పూర్ లోని మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం భీమ్ గల్ మండల కేంద్రంలో కాలినడకన పర్యటించారు ఎమ్మెల్సీ కవిత. స్థానిక ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలిన ఎమ్మెల్సీ కవిత, ప్రజలతో ముచ్చటించారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి భీమ్ గల్ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కవిత శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Also Read : శ్రీగంధానికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్