తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట.. అక్షర సత్యమని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని సీఎం పలుమార్లు చెప్పారు. దానికనుగుణంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే అభివృద్ధిలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూరదృష్టి.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసిన కార్యాచరణ ఫలితంగా దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కీర్తిని గడించింది. తెలంగాణ రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ(రాష్ట్ర స్థూల ఉత్పత్తి), తలసరి ఆదాయం రికార్డు స్థాయి వృద్ధిరేటు నమోదు చేసినట్లు కేంద్ర గణాంకాల శాఖ సోమవారం విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జీఎస్డీపీలో, తలసరి ఆదాయంలో భారీ స్థాయిలో వృద్ధిరేటు నమోదు కావడం విశేషం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో 19.10 శాతం వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యధికంగా 18.78 శాతం వృద్ధి రేటు నమోదు అయింది.
2014-15 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో 12.02 శాతం వృద్ధిరేటు నమోదవగా, తలసరి ఆదాయం 10.65 శాతం వృద్ధిరేటు నమోదు అయినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో జీఎస్డీపీలో 2.25 శాతం, తలసరి ఆదాయంలో 1.64 శాతం వృద్ధిరేటు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం జీఎస్డీపీలో 16.85 శాతం వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో 17.14 శాతం వృద్ధి రేటు అధికంగా నమోదైంది

Also Read : అవినీతి మంత్రులకు కెసిఆర్ వత్తాసు – బిజెపి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *