Sunday, April 13, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసంస్కృతం ఉండగా... తెలుగెందుకు దండగ!

సంస్కృతం ఉండగా… తెలుగెందుకు దండగ!

భాష దానికదిగా గాల్లో పుట్టి ఊడి పడదు. మనమే పుట్టించాలి. అందుకే మాయా బజార్లో-
“ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?”-అన్న మాటల మాంత్రికుడు పింగళి సూత్రీకరణే సర్వకాల సర్వావస్థల భాషా సిద్ధాంతమయ్యింది. ఉన్న భాషకు వ్యాకరణం పుడుతుందే కానీ…వ్యాకరణం ముందు పుట్టి భాష తరువాత పుట్టదు. అలా పుడితే అది జీవ భాష కాదు. నిర్జీవ భాష.

ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు వేయడం సాధారణం. లేదా అత్యధిక మంది వాడే భాష సహజంగా గొప్పది అనుకుంటాం. ఈ కోణంలో చూసినప్పుడు ఆధునిక కాలంలో నిత్యవ్యవహారంలో వాడుకలో లేనే లేని భాష- సంస్కృతం. ఆ సంస్కృతం గొప్పది అనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి.

  1. వేదాలు, పురాణాలు ఇతర భారతీయ పురాతన గ్రంథాలన్నీ మొదట సంస్కృతంలోనే ఉండేవి.
  2. ఆధ్యాత్మిక సాహిత్యం, మంత్ర భాగం సంస్కృతమే.
  3. స్వాతంత్ర్యానికి ముందు వరకు రాజులు ఎక్కువ ప్రోత్సహించిన భాష- సంస్కృతం.
  4. శాస్త్ర గ్రంథాలన్నీ మొదట సంస్కృతంలోనే ఉండేవి.
  5. భారతీయ భాషలన్నిటికి సంస్కృతం మూలం అన్న నమ్మకం.
  6. ఇప్పుడు ఇంగ్లీషు మాట్లాడితేనే మనుషులుగా గుర్తిస్తున్నట్లు…ఒకప్పుడు సంస్కృతం తెలిస్తేనే గొప్పవారిగా గుర్తించేవారు.
  7. పొరుగింటి పుల్లకూర రుచి.
  8. ఆధిపత్య ధోరణి.
  9. అగ్రవర్ణాలు ఎక్కువగా ప్రోత్సహించడం

ఇంకా అనేకానేక కారణాలున్నాయి కానీ…ఇక్కడ అనవసరం.

“నిండు నూరేళ్లు చల్లంగ ఉండు”
అన్నది పదహారణాల అచ్చ తెలుగు మాట.

“శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”
అన్నది సంస్కృత వేదాశీర్వచనం.

నిజానికి అర్థంలో రెండూ ఒకటే. కానీ మనకు “చల్లంగ ఉండు” అంటే మొరటుగా, పట్టించుకోనట్లుగా, తేలికగా అనిపిస్తుంది. “శతమానం భవతి” అనగానే గంభీరంగా, మహా మంత్ర ఆశీర్వచనంగా, చాలా పవిత్రంగా, గొప్ప మర్యాదగా అనిపిస్తుంది. భాషకు సంబంధించి మన మనసులో ఉన్న అభిప్రాయాలను బట్టి వీటి విలువలు ఆధారపడి ఉంటాయి. ఇంతకంటే ఈ చర్చలోకి వెళితే సంప్రదాయవాదుల మనసు గాయపడుతుంది. వదిలేద్దాం.

“కట్టెదుట వైకుంఠము కాణాచయిన కొండ;
తెట్టెలాయె మహిమలే
తిరుమల కొండ”
అని అన్నమయ్య ఏరికోరి తెలుగును నూరి నూరి పదం పాడితే వెంకన్న నాలుగు మాడవీధుల్లో ఆనందపరవశంతో చిందులేశాడు.

“లావొక్కింతయు లేదు…”
అని పోతపోసిన తెలుగులో పోతన గజేంద్రుడు ఏడిస్తే అలవైకుంఠపురంబు వదిలి శ్రీమన్నారాయణుడు నేరుగా వచ్చాడు.

“ఓరామా!
నీ నామమెంత రుచిరా?”
అని రామదాసు తెలుగు కండ చక్కెర కలిపి పాడితే ఆ తీపి రుచిని భద్రాద్రి రామయ్య కూడా ఆస్వాదించాడు.

“నగుమోము కనలేని నా జాలి తెలిసీ…”
అని త్యాగయ్య తమిళగడ్డ మీద అచ్చ తెలుగులో గొంతెత్తితే జాలిగల రాముడు అయోధ్య వదిలి మనోవేగంతో కావేరీ తీరానికి వచ్చాడు.

అన్నమయ్య, పోతన, రామదాసు, త్యాగయ్యలు సంస్కృతంలో అపార పాండిత్యం ఉన్నవారు. అయితే వారు తెలుగువారు. తెలుగు భాషాభిమానులు. ఇలాంటివారు పట్టుమని పదిమంది పట్టుబట్టి తెలుగులో రాయడం వల్ల తెలుగు ఈమాత్రమయినా బతికి బట్టగట్టగలిగింది.

సంస్కృతం మీద మన ప్రేమ కంటిని మించిన కాటుక వంటిది. కంటికి కాటుక అందం. కానీ కన్ను కనపడనంతగా కాటుక పులుముకుంటే కళ్లు పోతాయి. చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటుంది. భాషా పరిణామక్రమంలో ఎంతో కొంత మూల రూపాలు, ఇతర భాషల పదాలు వస్తాయి. సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకుని తెలుగును చిన్న చూపు చూసిన మన నిర్లక్ష్యం ఇప్పుడు మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్లు ఉంది.

తెలుగు కూడు, బువ్వ, ముద్ద, ఎంగిలిపడు మొరటు, అనాగరికం…సంస్కృత భోజనం, ఆహారం, ఉపాహారం, అన్నం చాలా గొప్పవి. నాజూకయినవి.
మొక్కుకు దిక్కు లేదు…నమస్కారం సంస్కారవంతమైనది. చదువు పనికి రానిది…విద్య గొప్పది.
తుండు గుడ్డ పనికిరానిది…ఉత్తరీయం మహా గొప్పది. కాపు కాయకూడదు…ఫలసాయమే రావాలి. తిండి గింజలు తినకూడదు…ధాన్యమే ధ్యానంగా తినాలి. ఎండ పొద్దు వద్దు…మధ్యాహ్నం ముద్దు.

ఇలా తెలుగు భాషలో అందంగా, అద్భుతంగా, సహజంగా ఉన్న మాటలను వాడడం మానేసి సంస్కృతం మాటలను వాడడం శతాబ్దాల క్రితమే మొదలు పెట్టాం. తెలుగు అధికార భాష, తెలుగు మాతృ భాష అన్న మాటల్లో కూడా అధికార, మాతృ మాటలు తెలుగు కాదు. సంస్కృతం.

భాషకు సంబంధించి మనది ప్రతీకాత్మక లేదా సంకేత బాధ. నిజం బాధ కాదు. తెలుగు మీడియా ప్రామాణిక భాషలో పారిభాషిక పదాలన్నీ సంస్కృతమే.
ఐక్య రాజ్య సమితి
అణ్వాయుధం
శిఖరాగ్ర సమావేశం
శీతలీకరణ కేంద్రం
ప్రశ్నోత్తర సమయం
సభాపతి
అనంతర పరిణామం
స్నాతకోత్సవం
విద్యాభ్యాసం
గృహ ప్రవేశం
ప్రత్యక్ష ప్రసారం
ఇవే మాటలకు తమిళంలో ఏయే మాటలు వాడుతున్నారో తెలుసుకుంటే తెలుగులో తెలుగు ఎంతో తెలిసిపోతుంది.

మనం రోజూ వాడే మాటల్లో ఏది తెలుగో? ఏది సంస్కృతమో? తెలుసుకుంటే మన సంస్కృతం మోజు ఎంత బలమయినదో పాలు తాగే పసిపిల్లలకు కూడా అర్థమైపోతుంది. గడచిన యాభై ఏళ్ళల్లో తెలుగులో సంస్కృతం స్థానాన్ని ఇంగ్లీషు ఆక్రమించింది.

సందర్భం:-
తెలంగాణాలో ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల్లో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడానికి వీలుగా అధికారికంగా చర్యలు మొదలయ్యాయి. ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీల్లో ఎప్పటినుండో సంస్కృతమే ద్వితీయభాషగా రాజ్యమేలుతోంది. అంటే తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రభుత్వమే తెలుగును తొక్కేసి…సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకుంటోంది. గతంలో టీ ఆర్ ఎస్ అధికారంలో ఉండగా ఈ ప్రయత్నం చేయబోయి…భాషాభిమానులు, పౌరసమాజం నుండి వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరి బుర్రలో ఆలోచనో కానీ…ప్రాంతీయ భాషల అస్తిత్వాలమీద ఒకవైపు బీ జె పి ని ప్రశ్నిస్తూ…మరోవైపు బతికి ఉండగానే తెలుగుకు తలకొరివి పెడుతున్నారు.

సెంట్రల్ యూనివర్సిటీ కంచ భూములకు రాహుల్ గాంధీ కంచె కట్టినట్లు…కొడిగట్టే ఇంటర్మీడియెట్ తెలుగుదీపానికి కూడా అదే రాహుల్ గాంధీ చేతులు అడ్డు పెట్టాలేమో!

కొసమెరుపు:-
ద్వితీయ భాషగా ప్రథమశ్రేణి సంస్కృతంలో రాస్తే వందకు వంద మార్కులు, వీలయితే వందకు వందా పది మార్కులు వస్తాయన్న గ్యారెంటీ ఉంది. ద్వితీయశ్రేణి తెలుగుకు ఆ ప్రథమ శ్రేణి వంద మార్కుల హామీ ఇవ్వండి. అప్పుడు పొరపాటున ఒక్కరయినా సంస్కృతం తీసుకుంటే ముక్కు నేలకు రాసుకోండి. సంస్కృతాన్ని తెలుగులో, ఇంగ్లీషులో రాస్తే వందకు వంద. తెలుగును తెలుగులో రాస్తే బొందకు బొంద. సున్నకు సున్నా-హళ్లికి హళ్లీ!

మా తెలుగు తల్లికి సంస్కృతం దండ!
మా తెలంగాణ తల్లికి దేవభాష అండ!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్