Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందని, బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ చివరి స్థానంలో నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లాలోని ముధోల్లో నూతనంగా నిర్మించిన 30 పడకల దవాఖాన భవన నిర్మాణానికి మంత్రులు హరీశ్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..కేంద్రంలో ఝూటే బాజీ సర్కార్ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.


తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్కటి లేదన్న హరీశ్ రావు రాష్ట్ర అభివృద్ధిపై రెండు పార్టీల నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్, ఎరువులు, వంట గ్యాస్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల పేరిట కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని మభ్యపెడుతోందని, ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు ఇస్తామంటూ రైతుల బావుల దగ్గర మీటర్లు పెడుతున్నదని ఆరోపించారు. ఒక పూట ఉపాసం ఉంటాం కానీ, రైతులకు అన్యాయం చేసేది లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో యాసంగి వడ్లను కొనకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బీజెపీ నాయకులు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, విద్వేషాలు, కొట్లాటలు ముఖ్యం కాదన్నారు. గలగల పారే గోదావరి జలాలు కావాలన్నారు. యూపీలో ఈనెల 10న ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఈ రోజు ఉదయం బాసర సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీశ్ రావు ఆ తర్వాత శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముదోల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణ, మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

Also Read : మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com