Tuesday, September 17, 2024
HomeTrending Newsనీట్ పేపర్ లీక్... ఫలితాలపై అనుమానాలు ?

నీట్ పేపర్ లీక్… ఫలితాలపై అనుమానాలు ?

నీట్ యూజీ 2024 ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా ఫస్ట్ ర్యాంక్.. దీనిలో ఏడుగురు హర్యానాకి చెందిన ఒకే ఎగ్జామ్ సెంటర్ వారు కావడం…వారికి 720/720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు రేగుతున్నాయి.

అదే సెంటర్లో ఎగ్జామ్ రాసిన జాన్వీ అనే విద్యార్థిని 179 ప్రశ్నలను అట్టెంప్ట్ చేయగా అందులో 163 కరెక్ట్ అయ్యాయి అలా చూసుకుంటే ఆమెకు 636 మార్కులు రావాలి కానీ 720/720 ఎలా వచ్చాయంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎంతో మంది విద్యార్థులకు సాధ్యం కాని విధంగా 718, 719 మార్కులు వచ్చాయి.. (+4, -1) విధానాన్ని నీట్ ఎగ్జామ్లో ఫాలో అవుతారు.. అలా చూసుకుంటే 718, 719 మార్కులు ఎలా సాధ్యమని ప్రశ్నలు తలేత్తుతున్నాయి.

నీట్‌ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ మాజీ చైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని వేయాలని నిర్ణయించింది. కమిటీ వారం రోజుల్లో సిఫారసులతో కూడిన నివేదిక ఇస్తుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) డీజీ సుబోధ్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని.. ఆ తర్వాత ఫలితాలను సవరించే అవకాశం ఉందని తెలిపారు.

నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఎన్టీయే డీజీ సుబోధ్‌కుమార్‌ ఖండించారు. పేపర్‌ లీక్‌ కాలేదని.. ఎలాంటి అవకతవకలు జరగలేవని స్పష్టంచేశారు. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్‌ మార్కుల వల్లే పలువురు విద్యార్థులు అధికంగా మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. అందుకే 1,563  మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్‌ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని.. ఆ తర్వాత ఫలితాలను సవరించే అవకాశం ఉందని తెలిపారు.

2019 నుంచి ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో నీట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు బలపడుతున్నాయి. ఇప్పటివరకు నీట్‌ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. 2019, 2020లో ఒక్కొక్కరు చొప్పున టాపర్లుగా నిలిచారు. 2021లో ముగ్గురు, 2022లో ఒక్కరు, 2023లో ఇద్దరు టాప్‌ స్కోరు సాధించారు. ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలవడం, హర్యానాలో ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఏడుగురు ఉన్నారనే వార్తలు..  విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

కొంత మంది విద్యార్థులకు 100 పైగా గ్రేస్ మార్కులు కలిపారని విమర్శలు వస్తున్నాయి. జూన్ 14  విడుదల చేస్తానన్న ఫలితాలు జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజు విడుదల చేయటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

పేపర్ లీక్ తో కష్టపడి రాసిన విద్యార్థులు నష్టపోయారని.. వారికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు దీరాక జరిగే పార్లమెంటు మొదటి సమావేశాల్లో నీట్ గోల్మాల్ అంశం ప్రధానంగా ప్రస్తావించేందుకు విపక్షాలు సిద్దం అయ్యాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్