Friday, April 19, 2024
Homeసినిమాతెలంగాణలో థియేటర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో థియేటర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో రేపటి (జూలై 18, ఆదివారం) నుంచి థియేటర్ల లో మళ్ళీ బొమ్మ పడనుంది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నెల 23 నుంచి కొత్త చిత్రాలను ప్రదర్శించాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. థియేటర్లలో వంద శాతం సీటింగ్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తలసానిని కలిసి వినతి పత్రం అందజేశారు.

సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. ఈరోజు మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఒక సంవత్సరం నుండి సినిమా దియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని మంత్రికి వివరించారు. సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా ధియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని, ప్రభుత్వం ఈ కష్టకాలంలో అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు.

ప్రధానంగా సినిమా దియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ ఛార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, SGST ట్యాక్స్ ను రద్దు చేయాలని, GO 75 ను పునరుద్దరించాలని, షూటింగ్ అనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించాలని తదితర డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో  సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్ గౌడ్, బాల గోవింద్ రాజ్ తాడ్ల తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో TSFDC ED కిషోర్ బాబు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్