Saturday, June 13, 2026
Homeసినిమాపారితోషికం విషయంలో నయన్ తరువాత త్రిషనే!

పారితోషికం విషయంలో నయన్ తరువాత త్రిషనే!

దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయిక నయనతార. చాలా ఏళ్లుగా ఈ రికార్డు నయనతార పేరుపైనే ఉంది. పారితోషికం విషయంలో ఇంతవరకూ మిగతా హీరోయిన్స్ ఎవరూ ఆమె దగ్గరలోకి కూడా రాలేదు. హీరోల సరసన నాయికగా కనిపించే కథలైతే, 6 నుంచి 8 కోట్ల వరకూ తీసుకుంటుందనే ఒక టాక్ ఉంది. ఇక నాయిక ప్రధానమైన ప్రాజెక్టుల కోసం ఆమె 10 కోట్ల వరకూ  తీసుకుంటుందని చెప్పుకుంటూ ఉంటారు. పారితోషికం విషయంలో ఇప్పుడు ఆమెకి దగ్గరలో త్రిష ఉందనేది తాజాగా వినిపిస్తున్న టాక్.

త్రిష కొంతకాలం క్రితం వరకూ ఇటు తెలుగు.. అటు తమిళ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ తరువాత కొత్త హీరోయిన్స్ నుంచి పోటీ పెరగడం వలన ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కాలక్షేపం చేస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే త్రిష గ్లామర్ చూసి చాలామంది షాక్ అయ్యారు. సినిమా చూసిన తరువాత, గతంలో కంటే త్రిష ఇప్పుడే బాగుందనే టాక్ వచ్చింది.

‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఎవరి కెరియర్ కి ఎంత హెల్ప్ అయిందో గానీ, త్రిష కెరియర్ గ్రాఫ్ ను మాత్రం ఒక్కసారిగా పెంచేసింది. ఆ తరువాత విజయ్ తో ‘లియో’ చేసిన ఆమె, ప్రస్తుతం  చిరంజీవి సరసన ‘విశ్వంభర’ చేస్తోంది. వెంకటేశ్ తోను.. కమల్ తోను కలిసి సెట్స్ పైకి వెళ్లబోతోంది. అందువల్లనే త్రిష తన పారితోషికాన్ని పెంచేసిందని అంటున్నారు. నయనతార తరువాత  అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా ఆమెను గురించి చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular