Thursday, April 18, 2024
HomeTrending Newsబీజేపికి ఓటు - మునుగోడుకు చేటు...కేటిఆర్

బీజేపికి ఓటు – మునుగోడుకు చేటు…కేటిఆర్

దేశం అప్పుల కుప్పగా మారిందని, స్వాతంత్ర భారతంలో 67 ఏండ్ల కాలంలో అందరు ప్రధానులు కలిసి చేసిన అప్పు 55.87 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని… 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఎనిమిదేండ్లలో మోడీ ఒక్కడే చేసిన అప్పు ఎంతో తెలుసా, 100 లక్షల కోట్ల రూపాయలని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన కేటిఆర్… బిజెపి ప్రజలను వంచించటమే పనిగా పెట్టుకుందన్నారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ధనబలంతో కొనాలనుకుంటున్న జూటా, జుమ్లా బీజేపిపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నట్టు కేటిఆర్ ప్రకటించారు.

ఛార్జ్ షీట్ లో ముఖ్యాంశాలు…

మునుగోడు ఫ్లోరైడ్ గోడు వినలేదు!

బొక్కలు వంగి..బతుకులు కుంగి లక్షలమంది జీవచ్ఛవాలుగా మారితే కేంద్రంలో అధికారం వెలగబెట్టిన బీజేపీ పట్టించుకున్న పాపాన పోలేదు. నాటి ప్రధాని వాజ్‌పేయి టేబుల్‌ మీద ఫ్లోరైడ్ బాధితుడిని పడుకోబెట్టి, గోడు వెళ్లబోసుకున్నా కనికరించలేదు. మానవత్వంతో స్పందించలేదు. మంచినీళ్లు ఇచ్చే ప్రయత్నమే చేయలేదు. ఫ్లోరైడ్ మహమ్మారిని మట్టుబెట్టి..మంచినీళ్లు ఇచ్చేందుకు చేపట్టిన మహత్తర పథకం మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేస్తే నీతిలేని మోడీ సర్కారు 19 పైసలు కూడా ఇయ్యలేదు. కానీ..ఒక చిన్న కంపెనీ యజమాని అని చెప్పుకుంటున్న రాజగోపాల్‌ రెడ్డికి రూ. 18 వేల కోట్ల పెద్ద కాంట్రాక్ట్‌ ను కట్టబెట్టారు బీజేపీ పెద్దలు.

ఎన్నో పోరాటాల ఫలితంగా మంజూరయ్యి చౌటుప్పల్‌లో ఏర్పాటు కావలసిన ఫ్లోరైడ్‌ అండ్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్‌ ను గద్దలా వేరే రాష్ట్రానికి తన్నుకుపోయి నల్లగొండకు తీరని ద్రోహం చేసింది బీజేపీ. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని 2016లో నాటి కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. ఫ్లోరైడ్ బాధితులకు ఆర్థిక సాయం చేస్తామని చేసిన వాగ్దానం గాలికిపోయింది..వంచనే మిగిలింది.

మగ్గానికి మరణ శాసనం – చేనేతకు ఉరి

చరఖా తిప్పి, నూలు వడికి చేనేతను స్వదేశీ ఉద్యమానికి ప్రతీకగా నిలబెట్టిండు గాంధీ మహాత్ముడు. ఇప్పుడు మోడీ వచ్చి చరిత్రలో తొలిసారి చేనేతపైన పన్నువేసి మగ్గానికి మరణశాసనం రాస్తున్నడు. 5 శాతం జీఎస్టీ విధించమే కాదు. దానిని 12 శాతానికి పెంచాలని దుర్మార్గమైన ఆలోచన చేసి…బట్టలు నేసే వాళ్ళ పొట్ట కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నది మోడీ ప్రభుత్వం. స్వాతంత్ర స్వర్ణోత్సవాల కోసం జాతీయ జెండాల తయారీని దేశ నేతన్నలకు అప్పగించకుండా, చైనా నుంచి దిగుమతి చేసుకునే దౌర్భాగ్యం పట్టించింది ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం.

ఉన్న స్కీమ్‌లన్నీ ఊడగొట్టి, చేనేత కళాకారుడి చేతిని నరికేసేస్తున్నది మోడీ సర్కారు

– ఆలిండియా హాండ్లూమ్‌ బోర్డు రద్దు
– ఆలిండియా హాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు
– మహాత్మ గాంధీ బున్‌కర్ బీమా యోజన రద్దు
– లాంబార్డ్ బీమా రద్దు
– హౌజ్‌ కం షెడ్ స్కీం రద్దు
– థ్రిఫ్ట్ ఫండ్ రద్దు
– యార్న్‌పైన సబ్సిడీ 40 నుంచి 15 శాతానికి తగ్గింపు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వస్త్రకేంద్రాలు వున్న రాష్ట్రం తెలంగాణ. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట్, దుబ్బాక, సిద్ధిపేట, సిరిసిల్ల, వరంగల్‌ లలో అద్భుత నైపుణ్యం గల వేలాది మంది నేతన్నలు దారాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. తెలంగాణ సర్కారు నేతన్నకు చేయూతనిచ్చే అనేక పథకాలను చేపడుతుంటే..కేంద్రం మాత్రం సంపూర్ణ సహాయ నిరాకరణ చేస్తున్నది. ఎన్ని ప్రతిపాదనలు పంపినా ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నది.

తెలంగాణలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ స్థాపించాలని కోరితే స్పందనలేదు.

హాండ్లూమ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని అడిగితే పట్టించుకోలేదు.

నేషనల్‌ టెక్స్‌టైల్ రీసెర్చ్‌ సెంటర్ మంజూరు చేయమంటే చలనంలేదు.

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు నయాపైసా ఇవ్వలేదు.

సిరిసిల్ల పవర్‌లూం పార్క్‌కు సహకారం లేదు.

26 బ్లాక్ లెవల్ క్లస్టర్లు కోరితే స్పందన లేదు.

నారాయణపేటలో హాండ్లూమ్ పార్క్‌ పెడతామని అమిత్‌ షా ఇచ్చిన హామీ అటకెక్కింది.

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో అక్కడ హాండ్లూమ్ పార్క్ తీసుకొస్తామని

దొంగమాటలు చెప్పి, తర్వాత చేతులెత్తేసారు.

మోటర్లకు మీటర్లు – ఉచిత విద్యుత్‌కు ఉరి

బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టాల్సిందే, నెలనెలా రైతు కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడమీద కత్తిపెట్టి బెదిరిస్తున్నది మోడీ సర్కారు. ఉచిత విద్యుత్‌ను బందుపెట్టి, బోరుబావుల కింద కరెంట్‌తో వ్యవసాయం చేసుకుంటున్న 30 లక్షల మంది రైతుల నోట్లో మట్టిగొట్టాలని చూస్తున్నది కేంద్రం. రైతులపై పగబట్టిన బీజేపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెడితేనే ఏడాదికి రూ. 6 వేల కోట్ల రుణం ఇస్తమని షరతులు పెట్టి రాష్ట్రాన్ని బ్లాక్ మెయిల్ చేసింది. రైతుల ప్రయోజనం కల్పించడం కోసం సుమారు రూ. 30 వేల కోట్ల రుణాన్ని వదులుకుంది కేసీఆర్ ప్రభుత్వం. యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌కు రుణాలు నిలిపేసి, ప్రాజెక్టుకు అడ్డుపుల్లలు వేస్తూ తెలంగాణను చీకట్లోకి నెట్టాలని కుట్రలు చేస్తున్నది కేంద్రం.

కృష్ణా జలాలపై నికృష్ట రాజకీయం

కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా నికృష్ట రాజకీయం చేస్తున్నది కేంద్రంలోని బీజేపీ. సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్‌కు రెఫర్ చెయ్యాలని 8 ఏండ్ల నుంచి కోరుతున్నా…అంతులేని జాప్యం చేస్తూ తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నది. 575 టీఎంసీల న్యాయమైన వాటా దక్కకుండా చేస్తూ, ఉమ్మడి నల్లగొండ పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నది మోడీ ప్రభుత్వం. కేంద్రం నిర్వాకం వల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలు వందల టిఎంసీల నీళ్లను నష్టపోయాయి. కేంద్రం నాన్చుడి ధోరణితో డిండి, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు అడ్డు తగులుతున్నది. ఎగువనున్న అప్పర్ భద్రకు, దిగువనున్న పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన మోడీ సర్కారు, పాలమూరు ప్రాజెక్టుకు హోదా అడిగితే మొండిచేయి చూపిస్తున్నది. డిండి, శివన్నగూడెం, కిష్టరాయిపల్లి సహా మునుగోడును సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా కేంద్రం పైస సాయం చేయలేదు. పైగా, కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చిల్లర రాజకీయాలు చేస్తున్నది బీజేపీ.

వంటగదిలో మంటపెట్టిన మోడీ

నరేంద్ర మోడీ హయాంలో సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటింది..మళ్లీ కట్టెల పొయ్యి వాడాల్సిన పరిస్థితి దాపురించింది. వంట గదిలో సిలిండర్ మంటలు పెట్టి, ఆడబిడ్డల కంట కన్నీళ్లు తెప్పిస్తున్నది కేంద్రం. 2014లో 410 రూపాయలు వున్న గ్యాస్‌ సిలిండర్ ధర ఇప్పుడు 1100 రూపాయలు దాటింది. పేదల బతుకులకు గుదిబండగా మార్చింది. ప్రపంచంలోనే సిలిండర్ కు అత్యధిక రేటు వసూలు చేస్తున్న పుణ్యాత్ముడు మోడీ. ఆయిల్ కంపెనీల నష్టాలకు 22 వేల కోట్ల రూపాయల పరిహారం ప్రకటించిన బీజేపీకి, ఆడబిడ్డల కష్టాలు మాత్రం గుర్తురాలేదు. సిలిండర్ పై సబ్సిడీకి మంగళం పాడారు. 2014 లో ఉన్న నగదు బదిలీ రాయితీని సున్నాకు తీసుకొచ్చి దొంగదెబ్బ కొట్టారు.

జనంపై పెట్రో బాంబు.. ధరల దాడి

అడ్డగోలుగా ఎక్సైజ్‌ సెస్సు లు వడ్డించి, పెట్రోల్ డిజీల్ ధరలను సెంచరీ దాటించిన ఘనడు మోడీ. ముడి చమురు ధర పెరగకున్నా, అదనపు సెస్సులు మోత మోగించి… మోడీ చమురు రేట్లను పెంచి, జనం చేతి చమురు వదిలించింది బీజేపీ ప్రభుత్వం. కరోనా కాలంలో కనికరం చూపకుండా సెస్సులు పిండుకొని ఎనిమిదేండ్లలో 30 లక్షల కోట్ల రూపాయలను దండుకున్నారు. అడ్డూ అదుపూలేని పెట్రో రేట్ల వల్ల ద్రవ్యోల్బణం 12 ఏండ్ల గరిష్ఠానికి పెరిగి దడ పుట్టించింది. నిత్యావసర వస్తువులు ధరల దాడిలో సామాన్యుల బతుకు అల్లకల్లోలమైంది. ఉప్పులు, పప్పులు, నూనెలు, కూరగాయలు భగ్గుమని ఏం కొనేటట్టు లేక, ఏం తినేటట్టు లేక పేదల బతుకు బండి తిరగబడింది. ట్రాక్టర్లు హార్వెస్టర్ల కిరాయిలు పెరిగి దుక్కులు దున్నే ఖర్చులు, కోతలు కోసే రేట్లు రెట్టింపై రైతు పెట్టుబడి ఖర్చు తడిసిమోపెడైంది.

గిరిజన రిజర్వేషన్లకు మోకాలడ్డు

పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానానికి ఆమోదం చెప్పకుండా 5 ఏండ్లు తొక్కిపెట్టి గిరిజన ద్రోహానికి పాల్పడింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే ఆ ప్రతిపాదనే రాలేదని పచ్చి అబద్ధం చెప్పి తెలంగాణ గిరిజన బిడ్డల హక్కులను చులకనగా చూసి అవమానించిన దుష్ట పార్టీ బీజేపీ.

గౌడన్నలకు దోఖా

బీజేపీ పరిపాలిస్తున్న పక్కరాష్ట్రం కర్ణాటకలో కల్లు గీతను నిషేధించి, గీత కార్మికుల కడుపుకొడుతున్నరు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి కల్లుగీతకు అనుమతిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత గౌడన్నలను మోసం చేస్తున్నరు. కులవృత్తిని కూలగొట్టి వేలాది గౌడన్నల జీవనోపాధిని హరించడమేగాక, ఆందోళన చేస్తున్నవాళ్లను క్రూరంగా అణిచివేస్తున్నది.

బీసీలపైన కపట ప్రేమ

బీసీల జనగణన చేయాలని బీసీ వర్గాల చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదు. అనేక రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపినా, మోడీ సర్కారు మొండిగా వ్యవహరిస్తూ బహుజన ప్రజల ఆకాంక్షను పక్కన పడేసింది. బీసీలపై దొంగ ప్రేమను ఒలకబోసే బీజేపీ, కేంద్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలన్న డిమాండ్‌ను పట్టించుకోవడమే లేదు.

ఉచితాలపై దాడి, సంక్షేమానికి సమాధి

కార్పొరేట్ దోస్తుల సేవలో తరిస్తున్న కాషాయ పార్టీ పేదల సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టేందుకు ఉచితాలు వద్దని కొత్త పాట పాడుతున్నది. మునుగోడు నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుకుంటున్న 2 లక్షల 38 వేల 915 మంది లబ్ధిదారుల నోటి కాడ ముద్దను లాక్కుంటారా? లక్షా 46 వేల 284 మంది అన్నదాతలకు రైతుబంధు పైసలు రానివ్వరా? 39,866 మంది అభాగ్యుల ఆసరా పెన్షన్లను ఆపేస్తరా? ఇక్కడ పెండ్లి చేసుకునే ఆడపిల్లల కళ్యాణలక్ష్మి కానుకను కట్ చేస్తరా? పండంటి బిడ్డని కనే తల్లులకు కేసీఆర్ కిట్ క్యాన్సిల్ చేస్తరా? యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ బంద్ చేస్తరా? ఈ ప్రశ్నలకు బీజేపీ నిజాయితీగా సమాధానం చెప్పగలదా?

నిరుద్యోగులను నిండా ముంచారు

ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశ నిరుద్యోగ యువతను నిండా ముంచింది. 8 ఏండ్లలో ఇవ్వాల్సిన 16 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్పమని ప్రశ్నిస్తే పకోడీలు, బజ్జీలు ముచ్చట్లు చెబుతున్నరు. కొత్త కొలువులు ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా వున్న 16 లక్షలకు పైగా పోస్టులను భర్తీ చేయకుండా దగా చేస్తున్నరు. అంతేకాదు, ప్రభుత్వ రంగ సంస్థలను పప్పుబెల్లాల్లా అమ్మేస్తూ, మూసేస్తూ లక్షల ఉద్యోగాలకు పాతరేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత రిజర్వేషన్ కోటాకు గండికొట్టారు. హైదరాబాద్ కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి, లక్షల ఐటీ ఉద్యోగాలకు గండికొట్టి, తెలంగాణ యువతకు తీరని ద్రోహం చేసింది మోడీ సర్కారే. దేశంలో నిరుద్యోగ భూతం విలయ తాండవం చేసి, 45 ఏండ్ల గరిష్ఠానికి ఎగబాకింది.

నల్లధనం – తెల్లముఖం

విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని రప్పిస్తామని రంకెలు వేసినవాళ్ళు, ఇప్పుడు నల్లధనం ఎక్కడా అని అడిగితే తెల్లముఖం వేస్తున్నారు. ప్రతీ ఒక్కరి జన్ ధన్ ఖాతాల్లో ధన్ ధన్ మని రూ. 15 లక్షల వేస్తామని, మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని, ఇప్పడేమో దాన్ని ఎలక్షన్ జుమ్లా అని కొట్టిపారేస్తున్నారు. ప్రపంచ ప్రజాస్వామ్యం చరిత్రలోనే ఇది అతి పెద్ద ఎన్నికల మోసం.

తెలంగాణ విద్యార్థులపై వివక్ష

దేశంలో కొత్తగా 157 మెడికల్ మంజూరు చేసిన మోడీ ప్రభుత్వం, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకుండా దారుణమైన ద్రోహం చేసింది. ప్రతీ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం చెబతున్నా, తెలంగాణలోని కొత్త జిల్లాలలో ఒక్క నవోదయ పాఠశాల కూడా ఏర్పాటు చేయకుండా కక్ష పూరితంగా వ్యవహరించింది. గత ఎనిమిదేండ్లలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ లాంటి 36 ప్రీమియర్ విద్యాసంస్థలను వివిధ రాష్ట్రాలలో నెలకొల్పిన కేంద్రం, తెలంగాణలో ఒక్క ఉన్నత విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. విభజన చట్టం ప్రకారం ట్రైబల్ వర్శిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా, కొర్రీలు పెడుతూ ఎనిమిదేండ్లుగా జాప్యం చేస్తూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నది.

విభజన చట్టానికి తూట్లు

కాజీపేట కోచ్ ఫాక్టరీ విషయంలో నయవంచనకు పాల్పడింది మోడీ సర్కారు. ఇక్కడ పెట్టాల్సిన కోచ్ ఫాక్టరీని గుజరాత్, లాతూర్ లకు తరలించి తెలంగాణ దశాబ్దాల కలల్ని కాల్చేసింది. బయ్యారం ఉక్కు ఫాక్టరీపై తుక్కు వాదనలు చేస్తూ, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ, ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని చావు కబురు చల్లగా చెప్పారు. గిరిజన ప్రజల ఆశల్ని, అవకాశాల్ని ఆవిరి చేశారు. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదాలు ఇస్తున్న కేంద్రం, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు హోదా అడిగితే కుదరదని చెప్పి తెలంగాణ రైతాంగంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెబుతున్న చట్టాన్ని చట్టుబండలు చేశారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను ఎగ్గొడుతూ, బకాయిల్ని విడుదల చేయకుండా తప్పించుకు తిరుగున్నది మోడీ ప్రభుత్వం. షెడ్యూల్ 9,10 లోని సంస్థలను విభజించకుండా నాన్చుతూ, రెండు రాష్ట్రాల మధ్య

చిచ్చుబెట్టి చోద్యం చూస్తున్నది.

ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలను అప్రజాస్వామికంగా గుంజుకొని, పురిట్లోనే తెలంగాణకు తొలి ద్రోహం చేసింది బీజేపీ. కరెంట్ కటకట ఉన్న తొలి నాళ్లలో, ఏడాదికి 300 రోజులు విద్యుత్ ఉత్పిత్తి చేసే లోయర్ సీలేరు ప్రాజెక్టును దూరం చేసి తెలంగాణ రైతులకు అన్యాయం చేసింది కేంద్రం. సీలేరు ప్రాజెక్టును కోల్పోవడం మూలంగా రాష్ట్రానికి ఏటా వెయ్యి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నది.

రైతు విరోధి మోదీ

దేశానికే అన్నంపెట్టేలా పంటలు పండిస్తున్న తెలంగాణ రైతాంగాన్ని చూసి కళ్లలో నిప్పులు పోసుకున్న మోడీ సర్కారు, ధాన్యం కొనకుండా కుటిల రాజకీయం చేసింది బీజేపీ. తిండిగింజలు కొనకుండా తొండి వ్యవహారం చేసి, రైతులను ఆగం చేయాలని చూసింది. బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరితే, మీ ప్రజలకు నూకలు తినిపించడం నేర్పించడని అవహేళనగా మాట్లాడి తెలంగాణను అవమానించారు కేంద్ర మంత్రులు.

రైతుల రక్తం కండ్ల జూసిన మోడీ

మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి, రైతు గొంతు కోయాలని చూస్తే కన్నెర్ర చేసిన కర్షకుడు దేశం నడిబొడ్డున ఢిల్లీలో నెలలపాటు చలిలో, వానలో, ఎండలో పోరాటం చేసాడు. ఉద్యమిస్తున్న రైతులను దేశ ద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించమడే కాకుండా బీజేపీ నేతలు కార్లు ఎక్కించి తొక్కించి చంపేశారు. దేశ చరిత్రలో బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పి, లెంపలు వేసుకున్న ప్రధాని మోదీయే.

దేశం అప్పుల కుప్ప

స్వాతంత్ర భారతంలో 67 ఏండ్ల కాలంలో అందరు ప్రధానులు కలిసి చేసిన అప్పు 55.87 లక్షల కోట్ల రూపాయలు. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఎనిమిదేండ్లలో మోడీ ఒక్కడే చేసిన అప్పు ఎంతో తెలుసా, .80 లక్షల కోట్ల రూపాయలు. పరిమితులు దాటి చేసిన దా’రుణాల’ కారణంగా 2014-15లో జీడీపీలో 50 శాతం ఉన్న అప్పులు, 2021 నాటికి 61.6 శాతానికి పెరిగాయి. 2014-15 లో వడ్డీల చెల్లింపుల కోసం మొత్తం రెవెన్యూలో 36.1 శాతం ఖర్చుపెట్టగా, 2021 లో వడ్డీలు కట్టడానికి రెవెన్యూలో 43.7 శాతం వెచ్చించాల్సిన స్థితికి చేరుకున్నది కేంద్రం.

రూపాయి పతనం…ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

మోడీ అసమర్థ ఆర్థిక విధానాల ఫలితంగా రూపాయి గింగిరాలు తిరిగి పాతాళానికి పడిపోయింది. మారకం విలువ 83 రూపాయలకు చేరి, జీవితకాల కనిష్ఠానికి దిగజారి ఆర్థిక వ్యవస్థ అతలాకుతమైతున్నది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లకు బైబై చెప్పి, పెట్టుబడులు వెనక్కితీసుకుంటున్నారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. పెద్ద నోట్ల రద్దు..పెద్ద డిజాస్టర్ గా మారి ఎకానమీ కకావికలమైంది. దొంగనోట్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. నగదు చలామణి గతం కంటే ఎక్కువైంది. 50 రోజుల సమయం ఇవ్వండి, ఫలితాలు చూపించకుంటే సజీవ దహనం చేయండి అని ఛాలెంజ్ చేసిన మోడీ….నోరు మెదపట్లేదు. 5 ఏండ్లలో ఏకంగా ఐదున్నర లక్షల కంపెనీలు మూతబడ్డయి. లక్షల కార్మికులు బతుకులు రోడ్డున పడ్డాయి. మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అయింది. చివరికి జాతీయ జెండాలు, పతంగుల మాంజాలు, దీపావళి దివ్వెలు కూడా చైనా నుంచే దిగుమతి చేసుకునే దుస్థితికి చేరుకున్నం.

బేచో ఇండియా – క్లియరెన్స్ సేల్

ప్రభుత్వ రంగాన్ని అంగట్లో వేలానికి పెట్టి, అడ్డికి పావుశేరు చొప్పున అమ్మేస్తున్నది మోడీ సర్కారు. రైళ్లు, విమానాలు, పోర్టులు, ఎల్ఐసీ, బంకులు, నవరత్నాలు, మినీ రత్నాలను తెగనమ్ముకుంటున్నారు. డిజిన్వెస్ట్మెంట్ పేరుతో 35 సంస్థలను, 3 లక్షల 72 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మేసారు.

కార్పొరేట్లకు కానుకలు – సామాన్యులకు పన్నులు

పేదలను కొట్టి, పెద్దలకు పెట్టే విధానం అవలంబిస్తున్న బీజేపీ, కార్పొరేట్ టాక్స్ ను ఏకంగా ఒకేసారి 10 శాతం తగ్గించి బడా బాబులకు వరాలిచ్చింది. పాలు, పెరుగు, పప్పు, ఉప్పులపై జీఎస్టీని పెంచి సామాన్యుల బతుకులను దుర్భరం చేసారు. బ్యాంకులను ముంచి, బకాయిలను ఎగవేసిన కార్పొరేట్ పెద్దలపై మోడీ సర్కారు జాలిపడి, ఏకంగా 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ (రైటాఫ్) చేసి వాళ్ల రుణం తీర్చుకుంది. కానీ, కాలే కడుపులకు ఆసరానిచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలుగా ప్రచారం చేస్తూ, వాటిని రద్దు చేయించడానికి కుట్రలు చేస్తున్నది.

ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలు మచ్చుకు కొన్ని మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి చేసిన ద్రోహాలు అంతులేనివి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మొదలుకొని ఈరోజు దాకా ప్రతిక్షణం తెలంగాణ పట్ల విపరీతమైన వ్యతిరేక ధోరణితో పనిచేస్తున్న బీజేపి అన్ని రంగాల్లో తెలంగాణకి చేసిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి తగిన శిక్ష విధిస్తారన్న నమ్మకం మాకు ఉన్నది.

మునుగోడు నియోజకవర్గానికి, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి బీజేపి చేసిన మోసాలకు, చూపిన వివక్షకు, పన్నిన కుట్రలకు సరైన సమాధానంగా నవంబర్ 3న జరుగనున్న ఉప ఎన్నికల్లో మునుగోడు ఓటర్లు భారతీయ జనతా పార్టీని ఒక దోషిగా నిలబెట్టి, తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

-కేటీఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్