Wednesday, March 18, 2026
HomeTrending NewsTSPSC SIT: సిట్ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి

TSPSC SIT: సిట్ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) పేపర్ లీక్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చారు. వారి నిరసనలతో ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసులో తాను చేసిన కొన్ని ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని ‘సిట్’ జారీచేసిన సమన్లపై స్పందించిన కాంగ్రెస్ నాయకుడు సిట్ కార్యాలయంలో దర్యాప్తు అధికారుల ముందు హాజరయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టిపిసిసి) చీఫ్ తన మద్దతుదారులతో ర్యాలీగా హిమాయత్‌నగర్‌లోని ‘సిట్’ కార్యాలయం వైపు వెళ్తుండగా, పోలీసులు వారిని లిబర్టీ క్రాస్‌రోడ్‌లో అడ్డుకున్నారు. లిబర్టి నుంచి హిమాయత్‌నగర్‌కు వెళ్లే బిజీ రోడ్డును పోలీసులు మూసేశారు. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.

కొంత మంది మద్దతుదారులతో రేవంత్ రెడ్డి హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయం వైపు నడిచారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో విధంగా సిట్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ఖండించారు. ఢిల్లీలో ఎంఎల్‌సి కవితను ఈడి ప్రశ్నించినప్పుడు బిఆర్‌ఎస్ వాళ్లు హైడ్రామా చేశారని, కానీ ప్రతిపక్షాలను బిఆర్‌ఎస్ అణచివేస్తోందని ఆయన పేర్కొన్నారు.

‘మా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం ఖండనీయం. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్‌కు సంబంధించి నేను చేసిన ప్రకటనల ఆధారంగా సాక్షాలను ఇవ్వాల్సిందిగా నన్ను సిట్ కార్యాలయంకు పిలిపించారు’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిఆర్‌పిసి సెక్షన్ 91 కింద సిట్ రేవంత్ రెడ్డికి నోటీసు జారీచేసింది. కామారెడ్డి జిల్లాలో మార్చి 19న చేసిన ఆరోపణలకు మద్దతుగా సాక్షాలు, సమాచారం ఇవ్వాలని సిట్ ఆయనను కోరింది. పేపర్ లీక్‌లో మంత్రి కెటి. రామారావు పిఏ హస్తం ఉందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కెటిఆర్ పిఏ తిరుపతి మండలానికి చెందిన అభ్యర్థుల సమాచారం ఉందని రేవంత్ రెడ్డి నాడు తెలిపారు. నిందితుడు రాజశేఖర్ రెడ్డి గ్రూప్ 1 ప్రిలిమినరీలో 103 మార్కులు పొందాడని పేర్కొన్నారు.

టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. ఒకటి కాదు… అరడజను ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని స్పష్టమైపోయింది. రోజుకో దారుణం బట్టబయలవుతోంది. ఇద్దరితో మొదలై 20 మందికి చేరింది… పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ – కేటీఆర్ అండ్ కో నియమించిన “సిట్” విచారణకు పిలిచింది. తప్పును ఎత్తి చూపడమే నేరమట. ఆరోపణల గురించి ప్రస్తావించ కూడదట. అన్యాయాన్ని నిలదీయకూడదట. సమాధానం చెప్పమని పిలిచింది. వెనక్కు తగ్గేదే లేదు. సిట్ కు సమాధానం చెబుతా… సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కోసం కొట్లాడుతా. 30 లక్షల నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా అని రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular