Friday, March 29, 2024
HomeTrending NewsCM KCR: రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా

CM KCR: రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా

అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు.
కెసిఆర్ మీడియా సమావేశం ముఖ్యాంశాలు
‘గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 1,29,446, వరి 72,709 మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారు. అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారు. వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఈ మాటలు చెప్పేవాళ్లలో ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు. కానీ మేం గర్వంగా చెబుతున్నాం.. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కంటే కూడా అత్యధికంగా తలసరి ఆదాయం రూ. 3,05,000తో ఉంది. జీఎస్‌డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్‌డీపీ పెరుగుదలతో వ్యవసాయం పాత్రే అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ వాటా 21 శాతం ఉంది. యావరేజ్‌గా 16 శాతం వరకు ఉంది. అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అద్భుతమైన వ్యవసాయం రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని.. ఇది మనకు చాలా గర్వకారణమని తెలిపారు. రైతులు ఏవిధంగా నిరాశకు గురికావద్దు.. ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలిపారు. ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలని చెప్పారు.
కేంద్రానికి నివేదిక పంపం.. వందశాతం మేమే ఆదుకుంటాం
ఈ దేశంలో ఓ పద్ధతి, పాడు లేదు. ఇన్సూరెన్స్‌ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్ప రైతులకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. పాత ప్రభుత్వాలు అంతే.. ఇప్పుడు కూడా అంతే.. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది. వాళ్లకు చెప్పినా లాభం లేకుండా ఉంది. భారతదేశానికే కొత్త అగ్రికల్చర్‌ పాలసీ కావాలి. ఇప్పుడు ఒక డ్రామా నడుస్తోంది. మేం రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కమిటీ ఎప్పుడొస్తుందో.. రిపోర్టు ఎప్పుడిస్తుందో ఆ దేవుడికే ఎరుక. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా ఆర్నెల్ల దాకా రూపాయి రాదు. ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా ఉంది. వాళ్లకు రాజకీయాలు తప్ప ప్రజల్లేరు.. రైతులు లేరు. అందుకే కేంద్రానికి నివేదిక పంపాలని అనుకోవట్లేదు. గతంలో పంపిన దానికే రూపాయి ఇవ్వలేదు కాబట్టి నిరసనగా ఇప్పుడు నివేదిక పంపాలని అనుకోవడం లేదు. భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చిండు కాబట్టి మా రైతులను మేమే కాపాడుకుంటాం. వంద శాతం మేమే ఆదుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మహాద్భాగ్యం.. మొక్కజొన్నకు అయితే ఎకరానికి రూ.3,333 ప్రకటించారు. వరి చేళ్లకు 5400, మామిడి తోటలకు 7200 ఇస్తామని స్కీంలో ఉంది. ఇది ఏ మూలకు సరిపోదు. కాబట్టి రైతులను మేమే ఆదుకుంటాం. అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.
ఎకరానికి 10వేలు అందజేస్తాం
తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్‌, ఉచిత నీళ్లు, వాటర్‌ సెస్‌ బకాయి రద్దు చేసి రైతులను ఆదుకోవడం వల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది. ఆ స్థితిని దెబ్బతీయనివ్వకూడదు కాబట్టి ఈ రంగాన్ని నిర్వీర్యం కానివ్వం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నిరాశపడొద్దు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. తెల్వక దీన్ని చాలామంది నష్టపరిహారం అని అంటారు. కానీ వీటిని సహాయ పునరావాస చర్యలు అని పిలవాలి. నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరూ ఇయ్యలేరు. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలి. అందుకే ఎకరానికి 10వేలు ప్రకటిస్తున్నా. వెంటనే వీటిని అందజేస్తాం. స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కౌలు రైతులను కూడా ఆదుకుంటాం. ఈ డబ్బును నేరుగా రైతులకు ఇవ్వకుండా.. ప్రతి రైతుతో పాటు కౌలు రైతులను కూడా పిలిపించి ఆదుకునేలా ఆదేశాలిస్తాం. పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తాం. జరిగిన నష్టానికి ఏ మాత్రం చింతించకుండా.. రబ్బర్‌ బంతి తిరిగొచ్చినట్లుగా.. భవిష్యత్తులో ఉన్నతమైన పంటలను పండించే ఆలోచనతో రైతులు ముందుకు పోవాలి. ఎట్టిపరిస్థితుల్లో ధైర్యాన్ని వీడొద్దు. అని రైతుల్లో భరోసా నింపారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్