Monday, June 17, 2024
HomeTrending Newsవారానికి మూడురోజులు వీఐపి బ్రేక్ రద్దు: టిటిడి

వారానికి మూడురోజులు వీఐపి బ్రేక్ రద్దు: టిటిడి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి రెండు రోజులపాటు క్యూ లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. వేసవి సెలవులు, ఎన్నికల తంతు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. వారాంతంలో ఈ రద్దీ మరింత ఉంటోంది.

ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆది వారాలలో వి.ఐ.పి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఈ మూడు రోజుల్లో విఐపి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేసింది. ఈ మార్పును గమనించి భక్తులు టి.టి.డికి సహకరించాలంటూ టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో మార్చి 17 నుంచే వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. మే 13 న ఎన్నికల పోలింగ్ ముగియడంతో బ్రేక్‌ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని  ఎన్నికల సంఘానికి టిటిడి బోర్డు లేఖ రాసింది. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందించడంతో మొన్న గంనలవారం నుంచి విఐపి సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు. కానీ రద్దీని దృష్టిలో ఉంచుకుని బ్రేక్ దర్శనాన్ని వారంలో నాలుగు రోజులపాటు  మాత్రమే అనుమతించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రోటోకాల్ విఐపిలు స్వయంగా వస్తేనే వారికి వసతి, దర్శన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్