Wednesday, April 17, 2024
HomeTrending Newsతెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం పలు అంశాలను చర్చించి ఆమోదించింది.
కేబినెట్ తీర్మానాలు :
2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం’ గా, మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.
రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమానికి 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న నేపథ్యంలో., సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటిస్తూ.. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.
ఈ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.
‘ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభం:
‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది.
సెప్టెంబర్ 16 వ తేదీన… రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలి.
సెప్టెంబర్ 17 – ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు , మున్సిపాలిటి, పంచాయతీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలి.


అదే రోజు (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం, హైద్రాబాద్ లోని బంజారా భవన్, ఆదివాసీ భవన్ ల ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరా పార్కు వద్దగల ఎన్టీఆర్ స్టేడియం వరకు గుస్సాడీ గోండు లంబాడీ తదితర కళారూపాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు.
సెప్టెంబర్ 18 – అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ’ స్పూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. అని కేబినెట్ తీర్మానించింది.
పోడు భూముల విషయం :
పోడు భూముల విషయం పై క్యాబినెట్ సుధీర్ఘంగా చర్చించింది. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల వ్యాప్తంగా రెవిన్యూ, ఫారెస్టు, ట్రైబల్ వెల్పేర్ శాఖల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో, ప్రతి జిల్లాలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టాలని కేబినెట్ సూచించింది.

దళిత బంధు :
దళితబంధు పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి పథకాన్ని వర్తింపచేసిన నేపథ్యంలో..
ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 1500 మంది చొప్పున దళితబంధు పథకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని…ఇందులో భాగంగా మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 500 మంది చొప్పున 118 నియోజకవర్గాల్లో అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి పథకం వర్తింప చేయాలని కేబినెట్ తీర్మానించింది.

• జిహెచ్ ఎంసీ మరియు మున్సిపల్ కార్పోరేషన్లలో కో ఆప్షన్ మెంబర్ల సంఖ్యను పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. జిహెచ్ఎంసీలో 5 నుండి 15 వరకు..ఇతర కార్పోరేషన్లలో 5 నుండి 10 వరకు, కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని తీర్మానించింది.
• రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్టు యూనివర్శిటీకి కొత్త పోస్టులను మంజూరీ చేయాలని కేబినెట్ తీర్మానించింది.
• సుంకిశాల నుంచి హైద్రాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరచాలని కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా అదనంగా 33 టిఎంసీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేందుకు నిర్ణయించింది. అందుకు గాను రూ. 2214.79 కోట్లను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
• రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కోర్టు భవనాల నిర్మాణాలకై 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపు జరపాలని కేబినెట్ తీర్మానించింది.
• భధ్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2016 కుటుంబాలకు నూతనంగా కాలనీలను నిర్మించి ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్