Saturday, March 7, 2026
HomeTrending Newsచేనేతకు చేయూత: విజయసాయి విజ్ఞప్తి

చేనేతకు చేయూత: విజయసాయి విజ్ఞప్తి

Help Handloom: దేశవ్యాప్తంగా సుమారు 21 లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని, కోవిడ్ మహామ్మరితో కుదేలైన  ఈ రంగాన్ని ఆదుకునేందుకు 25వేల కోట్ల రూపాయలతో  ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని వైఎస్సార్సీపీ  పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రంగం ద్వారా సాధికారత పొందిన వారిలో 87 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారున్నారని, వీరిలో 72 శాతం మహిళ‌లేనని, వీరిలో కూడా 68 శాతం వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీ లకు చెందిన వారున్నారని చెప్పారు. కోవిడ్  ఈ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని, చేనేత వస్త్రాలు అమ్ముడుపోకుండా నిల్వలు పెరిగి పోయాయని,  ఉత్పత్తి  నిలిచిపోయిందని సభ దృష్టికి తీసుకు వచ్చారు. దీనివల్ల నేతన్నలు ఆర్ధికంగా కుంగిపోయారని, జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మార్చి 2020 నుంచి జనవరి 2022 మధ్యలో పత్తి, పట్టు నూలు ధరలు 69 శాతం పెరిగిపోయాయ‌ని, నూలు అందుబాటు ధరలకు లభ్యం కానందున చేనేత ఆర్థికంగా గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రెండోది.. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసిన రెండేళ్ళ వ్యవధిలో పేద, బడుగు వర్గాలకు చెందిన చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఎలాంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించలేదన్నారు.  ఈ పరిస్థితుల నేపథ్యంలో చేనేత రంగం పునరుజ్జీవనం కోసం తక్షణం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పత్తి, నూలు వంటి ముడి సరుకులను సబ్సిడీపై అందించడంతోపాటు చేనేత పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించాలని, చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కేంద్ర‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular