Friday, March 29, 2024
HomeTrending Newsఉపాధి హామీకి కేంద్రం తూట్లు - మంత్రి ఎర్రబెల్లి

ఉపాధి హామీకి కేంద్రం తూట్లు – మంత్రి ఎర్రబెల్లి

Rural Employment Guarantee Scheme :

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ 2022 సంవత్సరపు క్యాలెండర్ ను, డైరీ ని బుధవారం మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల 75 లక్షల పనిదినాలు కేటాయిస్తే, ఇప్పటివరకు 13 కోట్ల 40 లక్షల పనిదినాలు (97.97 శాతం) కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. దీనికి తోడుగా మరో 2 కోట్ల పని దినాలకు ఈ సంవత్సరం లో అనుమతి లభించిందని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం క్రింద రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3 వేల 498 కోట్ల రూపాయల 40 లక్షల రూపాయలు వ్యయం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అందులో భాగంగా ఈ పథకం క్రింద కూలీలకు 2 వేల 381 కోట్ల రూపాయలు కూలీగా చెల్లించినట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో జీవనోపాధి, మౌలిక వసతుల కల్పనకు 1065 కోట్ల 60 లక్షల రూపాయలు మెటీరియల్ రూపంలో చెల్లించడం జరిగిందని మంత్రి తెలిపారు.

గ్రామీణ పేదల ఉపాధికి తద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఎర్రబెల్లి విమర్శించారు. కరోనా నేపథ్యంలో నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పొందుతున్నారని, ఇప్పుడు వాళ్లకు అవకాశం కూడా దక్కకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆయన తెలిపారు. దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 98 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, 2022-23 ఆర్ధిక సంవత్సరం లో 73 వేల కోట్ల రూపాయల కు కుదించడం శోచనీయమైన విషయమని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి దయాకర్ రావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ రాష్ట్ర కంప్యూటర్ ఆకౌంట్స్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ రఫీ సయ్యద్, ప్రధాన కార్యదర్శి విజయ్, జాయింట్ సెక్రెటరీ లు రఘు, సుధీర్ రెడ్డి, వెంకటేష్, రాష్ట్ర ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగయ్య, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్ర టెక్నికల్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ సంజీవ్, ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : మేమే ప్రత్యామ్నాయం: సోము ధీమా

RELATED ARTICLES

Most Popular

న్యూస్